Oct 25,2023 22:08


ప్రజాశక్తి-రాజోలు
మలికిపురం మండలం కేశనపల్లి, పడమటిపాలెం సిసిఫ్‌ సొసైటీ భూములను ఎవిఆర్‌ గ్యాస్‌ కంపెనీకి చట్ట విరుద్ధంగా సేకరించడం సరికాదని సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం సిసిఫ్‌ సొసైటీ భూములను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దళిత సొసైటీ భూములను ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సేకరించడం సరికాదన్నారు. దళిత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప, వారి నుంచి భూములను బలవంతంగా సేకరించడం సరికాదన్నారు. నిబంధలను ఉల్లంఘించి అధికారులు బలవవంతంగా భూ సేకరణ చేస్తే వారికి అండగా నిలబడతామన్నారు. సొసైటీ సభ్యులపై అధికారులు ఒత్తిడి మానుకోవాలన్నారు. భూ సేకరణ తక్షణమే నిలుపుదల చేయాలని, విధ్వంసకర అభివృద్ధి ని వ్యతిరేకద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని సొసైటీ సభ్యులతో కలిసి నినాదాలు చేశారు. ఈ సొసైటీ భూముల్లో గత 100 సంవత్సరాల నుంచి కొబ్బరి చెట్లు సరుగుడు తోటలు వేసుకుని జీవనోపాధి పొందుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను ఏవిఆర్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీకి అప్పగించడానికి జిల్లా అధికారులు బలవంతం చేస్తున్నారని బాధితుల తెలిపారని, ఎవిఆర్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీకి అప్పగించే సర్వేను తక్షణమే నిలుపుదల చేయకపోతే బాధితులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పీతల రామచంద్ర రావు, సిహెచ్‌.సూర్యప్రకాశరావు, గెడ్డం సాయిబాబు, శ్రీహరి స్థానిక రైతులు పాల్గొన్నారు.