
ప్రజాశక్తి-కనిగిరి: డివైఎఫ్ఐ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనిగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధుల ఆశ్రమం దగ్గర ఉన్న కాలనీలో డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ కనిగిరి పట్టణ కార్యదర్శి పి నరేంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్ బాబు, నాయకులు జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 1980వ సంవత్సరం పంజాబ్ రాష్ట్రం లోని లూథియానా నగరంలో అందరికీ విద్య, ఉపాధి కావాలంటూ ఏర్పాటైన డివైఎఫ్ఐ నేడు దేశంలోనే 2.10 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద యువజన సంఘంగా ఎదిగిందని తెలిపారు. యువతకు ఉపాధి కావాలంటూ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందని తెలిపారు. కనిగిరిలో నిమ్జ్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ హాస్పటల్లో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసి స్థానిక ప్రజానీ కానికి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కనిగిరి పట్టణ నాయకులు ఆర్ శివ, ఎం శ్రీను, ఐ నారాయణ, పి హజరత్, మల్లికార్జున, టోపీ వలి, అనిల్, ధర్మయ్య, మాల్యాద్రి మహిళా సంఘం నాయకులు ప్రసన్న, శాంతకుమారి, వెంకటమ్మ, షమీల, ఎలిశమ్మ, రత్తమ్మ పాల్గొన్నారు.