
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆరోగ్య సురక్ష పేరుతో ప్రారంభించిన కొత్త పథకం విధివిధానాలు ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రమంతా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో వణికిపోతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించాలని, మందులను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేషెంట్లకు పరీక్షలు ఉచితంగా చేసి తక్షణ వైద్యం అందించాలని కోరారు. ఈ వ్యాధుల తీవ్రత అర్థం కావడానికి డేటాను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కనీసం అంబులెన్సులు అందుబాటులో లేక ప్రసవవేదనతో మరణించిన తల్లులు, బిడ్డలు ఉన్నారని, డోలీ కట్టుకుని బాలింతలను తరలించిన ఘటనలూ ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ల్యాబ్లో ఆధునిక పరికరాలున్నా వాటిని నిర్వహించే సాంకేతిక నిపుణులు లేక అవి వృథాగా పడి ఉన్నాయని వివరించారు. ఆరోగ్యశ్రీ పేరుతో వెయ్యి రూపాయల పైన ఉచిత వైద్యం కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లినా వస్తుందని వాగ్దానం చేసి మూడేళ్లయినా ఇంతవరకు అమలుకు అతీగతి లేదని వివరించారు. పైగా పాత ఆరోగ్యశ్రీ అమలుకు నోచడం లేదని పేర్కొన్నారు. బిల్లులు రాక అనేక ఆస్పత్రులు దాన్ని వదులుకున్నాయని వివరించారు. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారని, సకాలంలో నిధులు విడుదల చేసి ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టం చేయకుండా, ఆరోగ్యశ్రీని సమగ్రంగా అమలు చేయకుండా, కొత్త పథకాన్ని ప్రకటించడం ప్రజలను పరిహాసానికి గురిచేయడమేనని వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం సేకరించే డేటాకు భద్రత ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని, వ్యక్తిగత ఆరోగ్య వివరాలను ల్యాబ్ టెస్టుల ద్వారా లభించే సమాచారం ప్రైవేటు ఫార్మసీ కంపెనీలకు కట్టబెడితే చాలా ప్రమాదమని పేర్కొన్నారు. వేల కోట్ల విలువ చేసే డేటాను ప్రభుత్వం నుండి అక్రమంగా వాడుకుని మందుల కంపెనీలు లక్షల కోట్లు ఆర్జించేందుకు తయారవుతున్నాయని, అందువల్ల ఈ డేటాను ప్రభుత్వ పరిశోధన సంస్థలకు మాత్రమే చెందేలా చట్టం చేయాలని కోరారు. వివిధ పథకాల పేరుతో ప్రజలు భ్రమ పెట్టే కన్నా ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్యం లభించేలా చట్టం చేస్తే అది సమాజానికి ఉపయోగపడుతుందని తెలిపారు. బ్రిటన్తో సహా అనేక యూరోపియన్ దేశాల్లో ఉన్న ఉచిత ఆరోగ్య సేవలు మాదిరి మన రాష్ట్రంలోనూ ప్రతి పౌరునికీ వైద్యసేవలు అందేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డాక్టర్ పథకంలో సేకరించే డేటాకు భధ్రత ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు ల్యాబ్ టెస్టుల ద్వారా లభించే సమచారం ప్రైవేటు ఫార్మశీ కంపెనీలకు కట్టబెడితే చాలా ప్రమాదమని పేర్కొంది. వేల కోట్ల విలువ చేసే డేటాను ప్రభుత్వం నుండి అక్రమంగా వాడుకొని మందుల కంపెనీలు లక్షల కోట్లు ఆర్జించేందుకు తయారవుతున్నాయని తెలిపింది. అందువల్ల ఈ డేటాను ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు మాత్రమే చెందేలా చట్టం చేయాలని డిమాండ్ చేసింది.
వివిధ పథకాల పేరుతో జనాన్ని భ్రమ పెట్టే కన్నా ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలని కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ప్రజలకు ఉచితంగా వైద్యం లభించేలా చట్టం చేస్తే అది సమాజానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. బ్రిటన్ తో సహా అనేక యూరోపియన్ దేశాల్లో ఉన్న ఉచిత ఆరోగ్య సేవలు ప్రతి పౌరునికి అందేలా చట్టం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది.