May 12,2023 16:11

ప్రజాశక్తి-చల్లపల్లి : కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ రఘు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక గుంటూరు బాపనయ్య శ్రామిక భవనంలో శుక్రవారం జరిగిన రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడుతూ మధ్య తరగతి పేద కార్మికుల కర్షకుల సమిష్టి పోరాటంతో కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేయాలని సూచించారు. గ్రామాలలో రాజకీయ విప్లవం సృష్టించి, యువతలో రాజకీయ చైతన్యం కలిగించాలని అన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు సమయపాలన పాటించాలని అన్నారు. ప్రతి కార్యకర్త ఏదో ఒక ప్రజాసంఘంలో పనిచేస్తూ ప్రజా సంఘాలలో పనిచేయాలని, ఆ సంఘాల లో ఉన్న సమస్యలు వెలికి తీసి పరిష్కారం కోసం పోరాటం చేసి పార్టీ బలోపేతం చేయాలని అన్నారు. ఉపాధి హామీ కూలీల సమస్యపై ఈనెల 23వ తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం లో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలు పాల్గొనేలా చైతన్య పరచాలని అన్నారు. మండల కమిటీ సభ్యులు మహమ్మద్ కరీముల్లా అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో  మండల కమిటీ కార్యదర్శి యద్దనపూడి మధు పాల్గొన్నారు.