న్యూఢిల్లీ : వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి వెనుకబడిన తరగతుల గణన జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గె తెలిపారు. కుల గణన నిర్వహించినట్లైతే వారి స్థితిగతులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుస్తాయని, అప్పుడు వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడం సులభమవుతుందని చెప్పారు. దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించడాన్ని ఆయన విమర్శించారు. దేశ ప్రజలకు చైతన్యవంతులుగా మారారని, ఇక 2024లో మోడీ ఆటలు సాగవని అన్నారు. రారుఘడ్ జిల్లాలో కొద్తరారు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిజెపి, ఆర్ఎస్ఎస్లు మహిళా వ్యతిరేక సిద్ధాంతాలను కలిగివున్నాయని విమర్శించారు. మహిళలు, వెనుకబడిన తరగతులు, నిరుపేదల గురించి బిజెపి నిజంగా ఆందోళన చెందుతున్నట్లైతే ఇప్పుడే మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలన్నారు. మహిళలు ముందుకు రావాలని ఆ పార్టీ కోరుకోవడం లేదన్నారు. వెనుకబడిన తరగతుల కుల గణన జరిగితే ఎంతమంది వెనుకబడ్డారు, వారిలో ఎంతమంది అక్షరాస్యులు, ఎంతమంది ఆర్థికంగా వెనుకుబడ్డారు వంటి వివరాలు తెలుస్తాయన్నారు. అప్పుడు వారి ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడానికి వీలు వుంటుందన్నారు. అందుకే నిరుపేదల, వెనుకబడిన వర్గాల గణన జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.










