Apr 17,2023 16:10

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ. కిషోర్, కే ఆర్ ఆర్ సి. ఎస్ డి సి నారాయణరెడ్డిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "నవరత్నాలు "తదితర పలు పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇందులో ఏమాత్రం రాజీపడరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో  బిబిఎల్ నుండి  స్లాబ్ వరకు అన్ని దశల్లో ఎప్పటికప్పుడు  పురోగతి సాధించి నిర్ణీత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఎవరు కూడా ముందస్తు అనుమతి లేనిదే సెలవులో వెళ్ళరాదని ముఖ్యంగా వాట్సాప్ ల ద్వారా సందేశాలు పంపి సెలవుల్లో వెళ్లడం సరికాదని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసరమైతే సంయుక్త కలెక్టర్ కు గాని, డిఆర్వోకు గాని తెలియజేసి సెలవులో వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించేందు కోసం సంయుక్త కలెక్టర్ ను, లేదా డిఆర్ఓ ను లేదా తనను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. పథకాల లక్ష్యాల సాధనలో అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతిరోజు తాను జిల్లా అధికారులతో ఉదయం 9:30 కు 35 ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వెనుకబడిన ప్రభుత్వ శాఖల్లో పురోగతి సాధించేందు కోసం సూచనలు జారీ చేస్తామన్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్ చేసిన లేదా వాట్సాప్ ద్వారా సంయుక్త కలెక్టర్, డిఆర్ఓ, కలెక్టరేట్ నుండి పంపించే సందేశాలు, కోరే వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలించి సకాలంలో స్పందించి సమాధానాలు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీసీఈఓ జ్యోతి బసు,  డి ఆర్ డి ఏ, డ్వామా పిడి లు పిఎస్ఆర్ ప్రసాద్, జి.వి.సూర్యనారాయణ డిపిఓ నాగేశ్వరరావు నాయక్, సిపిఓ శ్రీలత, డి.ఎస్.ఓ పార్వతి, ముడా విసి రాజ్యలక్ష్మి, డాక్టర్ గీతాబాయి, డిఇఓ తాహెర. సుల్తానా,  జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి  కె.సరస్వతి, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్ రాజా, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.