ప్రజాశక్తి - మంత్రాలయం
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న మహా నేత అని, అక్రమ కేసులతో, అరెస్టులతో టిడిపి వంటి మహా సముద్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంత్రించలేరని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి పేర్కొన్నారు. గురువారం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పట్టణంలోని రాఘవేంద్ర సర్కిల్లో టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు జైలులో ఉన్నారని, చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక 16 రోజులైనా జైలులో ఉంచాలని ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా అక్రమ అరెస్టు చేశారని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని, జపాన్కు చెందిన సీమెన్స్ కంపెనీ జగన్మోహన్పై పరువు నష్టం దావా వేస్తే విదేశాలకు తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు అంటే అభివృద్ధి, చంద్రబాబు అంటే సాఫ్ట్వేర్, చంద్రబాబు అంటే ఐటి అని కొనియాడారు. ఇక జగ్మోహన్ రెడ్డి అంటే దొంగ ఇసుక రవాణా, దొంగ సారా అని, అక్రమ ఆస్తుల కేసులున్న నేరస్తులని తెలిపారు. చంద్రబాబు మచ్చ లేని వ్యక్తిగా త్వరలో బయటకు రావడం ఖాయమని, రానున్న ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ముందుకు రావడం శుభ సూచకమని, కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తారని తెలిపారు. దీక్షలో కూర్చున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మకు, రాఘవేంద్రస్వామికి 116 కొబ్బరి కాయలు కొట్టారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎల్లారెడ్డి, చావిడి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి, తెలుగు యువత పవన్ కుమార్, ఎంపిటిసి నక్కి వెంకటేష్, బీసీ జనరల్ సెక్రటరీ వట్టేప్ప గారి నరసింహులు, మీడియా ఇన్ఛార్జీ విజయరామిరెడ్డి, నాయకులు అశోక్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రచ్చుమర్రి నరసింహులు, చిలుకలడోన హనుమంతు, షిండే హనుమంతు, కలుదేవకుంట రాగన్న, చెట్నిహల్లి ఈరన్న, వగరూరు పవన్ కుమార్ రెడ్డి, లింగప్ప, సున్నం బ్రదర్స్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఏబు, కోసిగి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేష్, నాడిగేని అయ్యన్న, పల్లెపాడు చంద్ర పాల్గొన్నారు. ఆలూరులో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ఆలూరు, చిప్పగిరి మండల నాయకులు దీక్షల్లో కూర్చున్నారు. కోట్ల సుజాతమ్మ 'బాబు కోసం నేను సైతం' అంటూ వైట్ బోర్డ్పై సంతకాల సేకరణ ప్రారంభించి మాట్లాడారు. చిప్పగిరి జడ్పిటిసి ఏరూరు మీనాక్షి నాయుడు, టిడిపి రాష్ట్ర నాయకులు నారాయణ రెడ్డి, జిల్లా, మండల కన్వీనర్లు అశోక్ యాదవ్, వలీ, కృష్ణమనాయుడు, అంజి పాల్గొన్నారు.
మంత్రాలయంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి










