పుట్టపర్తి అర్బన్ : ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే చిరుధాన్యాల వంటలను వినియోగించాలని కలెక్టర్ అరుణ్ బాబు, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం పట్టణంలోని సాయిఆరామంలో డిఆర్డిఎ, వైకెపి ఆధ్వర్యంలో అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ ఆవుటాల రమణారెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాల రుచి చూశారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాలకు ఒకప్పుడు మన దేశం పుట్టినిల్లులా ఉండేదన్నారు. పోషక విలువలున్న రాగి, సజ్జ, జొన్న, కొర్రలు తినడం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. చిరుధాన్యాల సాగుకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాగి, సజ్జ, జొన్న తదితర పోషక విలువలు ఉన్న వంటలను మర్చిపోతున్నారన్నారు. పోషక విలువలు లేని తిండి తింటున్నందునే శరీరం చచ్చు పడిపోతూ అనేక రోగాలు తెచ్చుకుంటున్నారన్నారు. చిరుధాన్యాలు వాడితే డాక్టరు అవసరం ఉండదన్నారు. జిల్లాలో 60 వేల చిరుధాన్యాలు సాగు చేస్తున్నారని ఆ సాగు లక్ష ఎకరాలకు విస్తరించే విధంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రి బోర్డ్ ఛైర్మన్ రమణారెడ్డి, రెడ్స్ సంస్థ భానుజా, డిఆర్డిఎ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, పౌర సరఫరాల శాఖ డిఎం అశ్వర్థనారాయణ నాయక్, ఐసిడిఎస్ పీడీ లక్ష్మికుమారి, సిరికల్చర్ జెడి పద్మమ్మ, పుడా ఛైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, ఎంపీపీ రమణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఓబుళపతి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, శాస్త్రవేత్త శ్రీనివాస్, ప్రకతి వ్యవసాయం లక్ష్మి నాయక్ పాల్గొన్నారు.










