
ప్రజాశక్తి-కంభం రూరల్
కంభం పట్టణంలో శనివారం మధ్యాహ్నం అరగంట పాటు ఒక మోస్తరు వర్షం కురిసింది. కంభం బస్టాండుకు ఉత్తరం వైపున ఉన్న కందులాపురం పంచాయతీ పరిధిలో ఉన్న రహదారి అలాగే కంభం గ్రామపంచాయతీలోని మురికి కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో పలుచోట్ల రహదారులు బురదమయంగా మారిపోయాయి. దీంతో ప్రజలు దుర్గంధం, దుర్వాసన ధాటికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారి చిన్నపాటి వర్షం కురిస్తే ప్రధాన రహదారులు వీధులు సైతం జలమయం కావడంతో పాటు దుర్గంధం దుర్వాసనలకు నిలయంగా మారిపోతున్నాయి. పట్టణంలోని నాయక్ వీధిలో మురికి కాల్వలను రెండు మూడు వారాలకు ఒకసారి శుభ్రపరుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక కందులాపురం పంచాయతీలోని కంభం బస్టాండ్ నుంచి కందులాపురం సెంటర్కు వెళ్లే ప్రధాన రహదారిలో కందులాపురం సర్పంచ్ తిరుపాలమ్మ మురికి కాలువల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోగా ఆక్రమణల తొలగింపు విషయంలో కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీంభాష మండల సర్వసభ్య సమావేశంలో సైతం ఆవేదన వ్యక్తం చేశారు.