ప్రజాశక్తి - కలెక్టర్ : మహిళలకు ప్రతి ఏటా ప్రభుత్వ అందిస్తున్న వైయస్సార్ చేయూత పథకం కోసం ఇప్పటికే జిల్లాలో అనేక మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వెరిఫికేషన్ చేయాలని పై స్థాయి అధికారులు ఇప్పటికే గ్రామ సచివాల యంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు దిశ నిర్దేశం చేసినప్పటికీ చాలామంది వెల్ఫేర్ అసిస్టెంట్లు గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లకుండా మహిళలందరినీ సచివాలయానికి పిలిపించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని అడ్డాపుశీల సచివాలయ పరిధిలో గల ఐదు గ్రామాల మహిళలను వెరిఫికేషన్కు మంగళవారం ఇక్కడకు వచ్చారు. సచివాలయానికి దూరంగా ఉన్న గ్రామాల్లోని మహిళలంతా ఒకేరోజు రావడంతో వారు నిలబడ్డానికి కూడా స్థలం లేక బయట మండుటెండలో గొడుగులు వేసుకొని నిల్చొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ సచివాలయం పరిధిలో గల మహిళలు తమ వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేయాలి కదా అని ప్రశ్నించగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రామాల్లో నెట్వర్క్ సమస్య ఉందని అందువల్ల వెరిఫికేషన్ ప్రక్రియను సచివాలయంలో ఉన్న వైఫై సౌకర్యం తో సులభంగా పూర్తి అవుతుందని చెప్పారు. దీంతో మహిళలంతా సచివాలయాల వద్దనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై అధికారులను ప్రశ్నించగా వెరిఫికేషన్ ప్రక్రియ గ్రామాల్లోనిి వెళ్లి చేయాలనీ వెరిఫికేషన్ సమయంలో ఎటువంటి నెట్వర్క్, ఆన్లైన్ చేయాల్సిన పనిలేదని వివరణ ఇచ్చారు. కాగా ఇదంతా స్థానిక వెల్ఫేర్ అసిస్టెంట్ తన పని భారం తగ్గించుకోవడానికి మహిళలను ఇబ్బంది పెట్టే ఆలోచనతో కేవలం ఈ పని చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.










