Apr 24,2022 10:30

'ఈ ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు' అని నెల్సన్‌ మండేలా చెప్పిన కొటేషన్‌తో చదువు గొప్పతనం గురించి వివరించిన హిందీ చిత్రం ''దస్వీ''. ఈ సినిమాలో రాజకీయ నాయకులకు చదువు ఎంత అవసరమనేదీ చక్కగా చెబుతారు. నిరక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్షా సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడు అనేది పూర్తి వినోదభరితంగా చూపించారు. వివరాల్లోకి వెళితే..

 

చదువు ప్రాముఖ్యత తెలిపే 'దస్వీ'



చిత్రం : దస్వీ
నటీనటులు : అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, యామీ గౌతమ్‌
కథ : రామ్‌ బాజ్‌పారు
నిర్మాత : దినేష్‌ విజన్‌
దర్శకత్వం : తుషార్‌ జలోటా
సంగీతం : సచిన్‌-జిగర్‌
ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమా
విడుదల తేదీ : ఏప్రిల్‌ 7, 2022

కథేంటంటే ఉత్తర భారతదేశంలో హరితప్రదేశ్‌ అనే కల్పిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి గంగారామ్‌ చౌదరి (అభిషేక్‌ బచ్చన్‌). జాట్‌ తెగకు చెందిన ఆయన ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. రాజకీయాలకు చదువుతో పనేమీ లేదు. కాబట్టి గంగారామ్‌ రాజకీయ నేతగా మారి, సీఎం స్థాయికి ఎదుగుతాడు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా అతను అన్నీ అవినీతి పనులే చేస్తుంటాడు. కానీ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కుంభకోణంలో అనుకోకుండా చట్టానికి దొరికిపోతాడు. నేరం రుజువై, జైలుశిక్ష పడుతుంది. గంగారామ్‌ జైలుకు వెళుతూ ఆయన భార్య విమలాదేవి (నిమ్రత్‌ కౌర్‌) ని సీఎంగా ప్రకటిస్తాడు. జైలులో గంగారామ్‌ మెప్పుకోసం అధికారులు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. ఆయన జైలులో ఉన్నట్లు కాకుండా సంతోషంగా గడుపుతూ ఉంటాడు. కొంతకాలానికి ఆ జైలుకు సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్‌ (యామీ గౌతమ్‌) వస్తుంది. ఆమె చాలా స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌. వచ్చీరాగానే గంగారామ్‌కు ఉన్న అదనపు సౌకర్యాలన్నీ కట్‌ చేస్తుంది. అతన్నీ అందరి ఖైదీల్లానే పనిచేయమని చెబుతుంది. చదువులేని వాడు సీఎం అయ్యాడంటూ హేళన చేస్తుంది. జైల్లో పని తప్పించుకోవడానికి ఎన్నో పథకాలు వేస్తుంటాడు గంగారామ్‌. చివరకు పదోతరగతి చదవాలని నిర్ణయించుకుంటాడు. అతడి ఉద్దేశాన్ని గమనించిన జైలు సూపర్నెంట్‌ పదో తరగతి ఫెయిలైతే మరలా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడకూడదు అని షరతు విధిస్తుంది. ఆ ప్రకారమే పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతాడు గంగారాం. మరోపక్క పదవిలో ఉన్న దర్పం చూసిన తరువాత గంగారామ్‌ భార్య తన భర్త బయటకు రాకూడదని కోరుకుంటూ ఉంటుంది. మరి గంగారామ్‌ పదో తరగతి పూర్తిచేశాడా? అతనికి ఎవరు సహాయపడ్డారు? అతను పదో తరగతి పూర్తి చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? చివరికి గంగారామ్‌ చౌదరి తెలుసుకున్నదేంటీ? పదో తరగతి తర్వాత గంగారామ్‌ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? అనేదే ''దస్వీ'' కథ.
      ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, యామీ గౌతమ్‌ ప్రధానపాత్రలు పోషించారు. అటు పాలిటిక్స్‌, ఇటు చదువు విలువను రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ కామెడీ తరహాలో రూపొందించారు దర్శకుడు తుషర్‌ జలోటా. అవినీతి, నిరక్షరాస్యుడైన ముఖ్యమంత్రి గంగారామ్‌ చౌదరిగా అభిషేక్‌ బచ్చన్‌ అద్భుతంగా నటించాడు. తన యాస, డైలాగ్‌ డెలీవరీ, నిరక్షరాస్యుడిగా పలికే కొన్ని మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాజకీయ నాయకుడి వ్యవహార శైలీ, అహంకారం, కామెడీ టైమింగ్‌, హావాభావాలు బాగున్నాయి. గృహిణి స్థానం నుంచి సీఎంగా మారిన తరువాత విమలాదేవి డైలాగ్‌లతో మంచి కామెడీ పండించింది. ముఖ్యమంత్రిగా, భర్తను తొక్కేసే భార్యగా, సెల్ఫీల పిచ్చి ఉన్న సెలబ్రిటీగా తన నటనతో చాలావరకు అలరించిందనే చెప్పవచ్చు. ఇక జైలు సూపరింటెండెంట్‌ జ్యోతి దేశ్వాల్‌గా యామీ గౌతమ్‌ తనదైన నటనతో మెప్పించింది. ఉన్నతాధికారి హుందాతనం, అహంకారం నిండి ఉన్న రాజకీయ ఖైదీకి గుణపాఠం చెప్పే పోలీసు అధికారిగా ఆకట్టుకుంది. అప్పటిదాకా పూర్తి వినోదభరితంగా సాగి.. సినిమా క్లైమాక్స్‌లో మాత్రం అభిషేక్‌ బచ్చన్‌, యామీ గౌతమ్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కట్టిపడేస్తాయి.
     ఈ సినిమాకు సచిన్‌, జిగర్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. సన్నివేశాలకు తగిన బీజీఎంతో వావ్‌ అనిపించారు. 'తారే జమీన్‌పర్‌ (చదవడానికి ఇబ్బందిపడటం), రంగ్‌ దే బసంతి (స్వాతంత్య్ర సమరయోధుల గాథలు), లాగే రహో మున్నాబారు (పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటిలోని పాత్రలు సజీవంగా మనముందుకు రావడం) వంటి స్పష్టమైన ప్రస్తావనలను ఈ సినిమాలో బాగా చూపారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏం ఇవ్వాలో అన్ని ఇవ్వడానికి ఈ సినిమా ప్రయత్నించింది. ఇవి ప్లస్‌ పాయింట్స్‌. దర్శకుడు తుషార్‌ జలోటా ప్రధానాంశంతో పాటు పక్క విషయాలపై దృష్టిని ఎక్కువగా పెట్టినట్లు అనిపించింది. సంభాషణల్లో, కథలో ఎలాంటి మ్యాజిక్‌ అనేది కనిపించదు. శిక్ష పడిన మాజీ ముఖ్యమంత్రి, గృహిణిగా ఉండి, అనుకోకుండా ముఖ్యమంత్రిగా మారిన విమలాదేవి పాత్రలు ఎందుకు అంత ఆకస్మిక పరివర్తనకు గురయ్యాయనేది బలంగా చెప్పలేకపోయారు. ఈ రెండు పాత్రలూ చకచకా మనముందుకు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతుంటాయి. ఇవి మైనస్‌ పాయింట్స్‌.