
జిల్లాలో 665 మందికి 693 ఎకరాల పంపిణీకి సన్నాహాలు
ప్రభుత్వ భూములు మూడు లక్షల ఎకరాలు ఉన్నట్లు లెక్కలు
జిల్లాలో రెండు లక్షల కుటుంబాలు భూమి లేని నిరుపేదలే
2003కు ముందు పంచిన భూముల్లో మూడొంతులు భూస్వాముల చేతుల్లోకే
ప్రభుత్వ భూములన్నీ సేకరించి పేదలకు పంపిణీ చేస్తేనే న్యాయం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
భూపంపిణీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతా తూతూమంత్రమని తేలిపోయింది. జనాన్ని మభ్యపెట్టేందుకు చేస్తున్న భూపంపిణీ తప్ప.. పేదలకు న్యాయం చేసేందుకు కాదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నెల 17న ఏలూరు జిల్లా నూజివీడులో భూపంపిణీకి సంబంధించి పట్టాలిచ్చేందుకు సిఎం పర్యటన ఖరారైంది. దీంతో అసలు జిల్లాలో ప్రభుత్వ భూములెన్ని ఉన్నాయి. భూపంపిణీ పేరుతో ప్రభుత్వం పేదలకు ఇస్తున్నదెంత, మిగిలిన భూముల పరిస్థితి ఏమిటనే చర్చ జనాల్లో మొదలైంది. ఏలూరు జిల్లాలో 15 రకాలకు చెందిన ప్రభుత్వ భూములు మూడు లక్షల ఎకరాల వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ భూములన్నీ అత్యధికంగా బడాబాబులు, రాజకీయ నాయకుల కబ్జాలోనే ఉన్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమించుకున్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గతంలోగాని, ప్రస్తుత ప్రభుత్వంగాని ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాల్లేవు. పేదలకు భూపంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ అందులో ఏమాత్రం నిజాయతీ లేకుండా పోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన భూమి 752 ఎకరాలు. దీనిలో 665 మందికి 693 ఎకరాలు పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేశారు. అంటే జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక శాతం భూమిని కూడా పేదలకు పంపిణీ చేయడం లేదని తేటతెల్లమవుతోంది. బడాబాబుల కనుసన్నల్లో లక్షలాది ఎకరాలు ఉండగా పేదలకు పంపిణీ చేసే భూమి 700 ఎకరాలు పైచిలుకు మాత్రమే. జిల్లాలో భూమిలేని నిరుపేద కుటుంబాలు రెండు లక్షల వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అర్హులైన పేదలందరికీ భూపంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పాలకులు మాత్రం తూతూమంత్రంగా ఏదో కొద్దిమందికి భూపంపిణీ చేసి మమ అన్పించేందుకు సన్నాహాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని సిపిఎంతో సహా వామపక్షాలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. 2003కు ముందు ఏలూరు జిల్లాలో 62 వేల ఎకరాల అసైన్డ్భూమి పంపిణీ జరిగినట్లు అధికారులు తేల్చారు. ఆ భూముల్లో మూడొంతుల భూమి బడాబాబుల చేతుల్లోకే చేరిపోయింది. నిరుపేదలంతా ఇంకా భూమి లేకుండానే ఉన్నారు. బడాబాబుల చేతుల్లో ఉన్న భూములన్నీ లబ్ధిదారుల పేరుమీదే ఉన్నాయి. ఆ భూములను తమకు అప్పగించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బడాబాబులకు అనుకూలంగా చట్టాలు సైతం మార్చేసిన పరిస్థితి ఉంది. జిల్లాలోని దెందులూరు, దోసపాడు, కొవ్వలి, పోతునూరు వంటి గ్రామాల్లో 600 ఎకరాల భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ భూములను ఎందుకు పంపిణీ చేయడం లేదో అర్థం కావడం లేదు. భూమి అనేది పేదలకు ఆస్తిగా ఉంటుంది. భూమి ఉంటే ఆర్థికంగా పేదలు పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. అటువంటి భూపంపిణీ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న విన్యాసాలు కేవలం ఓట్లు కోసమనేనని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం భూపంపిణీ విషయంలో పునరాలోచన చేసి, అర్హులైన పేద కుటుంబాలకు భూపంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా తూతూమంత్రంగా కొద్దిమందికి పట్టాలిచ్చి ఇదే భూపంపిణీ అంటూ హడావుడి చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.