Nov 08,2023 17:57

ప్రజాశక్తి - మండవల్లి
   నివాసముంటున్న భూమిపై శాశ్వత హక్కు కల్పించే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి 'జగనన్న భూ హక్కు భూ రక్ష' అనే పథకాన్ని తీసుకొచ్చారని డిఎల్‌పిఒ కె.పూర్ణచంద్రరావు తెలిపారు. బుధవారం మండలంలోని గన్నవరం సచివాలయంలో ఆయన కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ సర్వే సచివాలయం సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ స్వామిత్వ సర్వేను పటిష్టంగా నిర్వహించాలన్నారు. వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు జగనన్న సర్వే ఆఫ్‌ ఇండియా వారితో ఎంఒయు అవ్వడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామాల్లో గ్రామకంటంలో నివాసముంటున్న స్థలాలను పూర్తిస్థాయిలో సర్వే చేసి నిర్ధిష్టంగా భూమి ఎంత ఉందో తెలిపి, గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసి, వారికి డాక్యుమెంట్‌ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మండవల్లి మండలంలోని ఎనిమిది గ్రామాలలో రెండు దఫాలుగా కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం స్వామిత్ర సర్వే జరుగుతుందన్నారు. సర్వే చేసే క్రమంలో అభ్యంతరాలు తలెత్తితే డిప్యూటీ తహశీల్దార్‌, ఇఒపిఆర్‌డితో కూడిన కమిటీ పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారన్నారు. పూర్తిస్థాయిలో సర్వే అయిన అనంతరం గ్రామంలో ఎంత మంది అయితే డాక్యుమెంట్‌ లేని పేదలు ఉన్నారో వారందరికీ ఆ భూమిపై హక్కు కలిగించేలా డాక్యుమెంట్‌ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి త్వరితగతిన సర్వే పూర్తయ్యేల సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువ పిఆర్‌డి ఆనంద్‌ బాబు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.