Jan 29,2021 12:16

న్యూఢిల్లీ : వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పిన తర్వాత ఆ యాప్‌పై ఇండియన్స్‌లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. వాట్సాప్‌ను వద్దనుకొని పెద్దఎత్తున యూజర్లు ప్రత్యామ్యాయ యాప్‌లైన సిగల్‌, టెలిగ్రామ్‌ల వైపు వెళ్లారు. అసలు ఈ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన తర్వాత ఎంతమంది భారతీయులు వాట్సాప్‌ను డిలీట్‌చేశారో తెలుసుకోవడానికి లోకల్‌ సర్కిల్స్‌ ఓ సర్వే చేసింది. ఈ ఆన్‌లైన్‌ సర్వేలో దేశవ్యాప్తంగా మొత్తం 17వేల మంది పాల్గొన్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని సర్వే తెలిపింది.
5 శాతం మంది డిలీట్‌ చేశారట
కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన తర్వాత 5 శాతం మంది భారతీయులు వాట్సాప్‌ను డిలీట్‌ చేసినట్లు ఈ సర్వే తేల్చింది. ఇండియాలో మొత్తం వాట్సాప్‌ యూజర్ల సంఖ్య 40 కోట్లు కాగా.. ఈ లెక్కన సుమారు 2 కోట్ల మంది తమ వాట్సాప్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేశారని అనుకోవచ్చు. ఇక 21 శాతం మంది తాము వాట్సాప్‌ వాడకాన్ని తగ్గించి.. ప్రత్యామ్నాయ యాప్‌లను యాక్టివ్‌గా వాడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడించారు. మరో 22 శాతం మంది తాము వాట్సాప్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించేసినట్లు పేర్కొన్నారు.
'వాట్సాప్‌ పే'కు పెద్ద దెబ్బే..
వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌ కంటే 'వాట్సాప్‌ పే'కు ఈ కొత్త ప్రైవసీ పాలసీ పెద్ద దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తోంది. వాట్సాప్‌ డేటాను ఫేస్‌బుక్‌, ఇతర థర్డ్‌ పార్టీలతో పంచుకుంటే.. తాము 'వాట్సాప్‌ పే'ను వాడబోమని సర్వేలో పాల్గొన్న 92 శాతం మంది తేల్చి చెప్పడం విశేషం. అలాగే 79 శాతం మంది తాము వాట్సాప్‌ బిజినెస్‌ను ఉపయోగించమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఇప్పటికే 55 శాతం మంది వాట్సాప్‌ ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిపారు. యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తమ కొత్త ప్రైవసీ పాలసీ అమలును మే వరకూ నిలిపేసిన వాట్సాప్‌.. యూజర్ల ప్రైవేట్‌ చాట్‌ను ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకోమని కూడా చెప్పింది.