ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారిలో ఉన్న వరద నీరు కాలువలోకి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పాత బస్టాండ్ కూడలి నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు నదిని తలపించేలా ఉంది. ఈ రహదారి గుండా రాకపోకలు సాగించేందుకు స్థానికులతో పాటు, పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు నానా అవస్థలు పడుతూ రహదారికి ఇరువైపులా ఉన్న కాలువలపై అక్రమణలతో ఈ పరిస్థితి దాపురిస్తుందని, కాలువలపై ఆక్రమణలు జరిగినప్పుడు పర్యవేక్షణ చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని మున్సిపల్ అధికారులను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య అధికారులు ప్రధాన రహదారి కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించి కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగిస్తే గానీ వరదనీటి సమస్య పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు.










