Sep 25,2023 21:12

బస్సు సీట్లోనే మరణించిన శివ

ప్రజాశక్తి-సాలూరు, పార్వతీపురంరూరల్‌ : అటవీశాఖలో కురుపాం రేంజ్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.శివశంకర్‌(59) అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలారు. ఆయన సోమవారం ఉదయం సాలూరు నుంచి పార్వతీపురం వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కూర్చున్న సీటులోనే ప్రాణాలు వదిలారు. పార్వతీపురం సమీపిస్తున్న తరుణంలో బస్సు కండక్టర్‌ ఆయనను చూసి లేపగా అపస్మారక స్థితిలో ఉండడంతో 108 వాహనానికి ఫోన్‌ చేశారు. సిబ్బంది ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన ఎక్కువ కాలం సాలూరు అటవీ రేంజ్‌ కార్యాలయంలో పని చేశారు. ఇటీవల కురుపాం రేంజ్‌ కార్యాలయం నుంచి డెప్యుటేషన్‌పై ఇక్కడ కొన్నాళ్లు పనిచేశారు. డెప్యుటేషన్‌ రద్దు కావడంతో కురుపాం నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి స్థానిక అటవీ రేంజ్‌ అధికారి కె.రామారావు, కురుపాం రేంజ్‌ కార్యాలయ సిబ్బంది సంతాపం తెలిపారు.