ప్రజాశక్తి-ఆలూరు
భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2, 3న మంగళగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నాయకులు వరుణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆలూరు ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేస్తూ జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి గుమ్మానూరు జయరామ్ నియోజకవర్గంలో తన తమ్ముళ్లకే రాజకీయ ఉపాధి కల్పించి మిగతా వారిని రాజకీయ నిరుద్యోగులుగా మార్చారని మండిపడ్డారు. బిసివై పార్టీ పెట్టిన నెల రోజుల్లోనే పార్టీ అధినేత బి.రామచంద్ర యాదవ్ 600 కంపెనీల్లో 50 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబిఎ, ఎంసిఎ, బిటెక్ అర్హత గల నిరుద్యోగ యువత జాబ్మేళాలో పాల్గొనాలని కోరారు. ఎంపికైన వారికి రూ.13 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జీతం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 2, 3న విజయవాడ హ్యాపీ రిసార్ట్స్లో (డిజిపి ఆఫీస్ పక్కన, మంగళగిరి) ఉదయం 9 నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, నిరుద్యగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాయకులు గౌతంకృష్ణ యాదవ్, వెంకట రాముడు యాదవ్, జెడి.రంగస్వామి, పక్కీర, చంద్రశేఖర్, రంగస్వామి, అక్బర్, బాలచంద్ర శేఖర్, రాము యాదవ్, మనోహర్ పాల్గొన్నారు.
గోడ పత్రికలను విడుదల చేస్తున్న నాయకులు










