బిజెపి ద్వందవైఖరిని ఎండగడదాం..!
టిటిడి నిధులు కేటాయించేవరకూ పోరాటం
పరిపాలనా భవనం వద్ద అఖిలపక్షం ధర్నా
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
తిరుపతి అభివద్ధి విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని, సమస్య పరిష్కారం అయ్యేవరకూ వివిధ రూపాల్లో పోరాడుతూనే, బిజెపి ద్వందవైఖరిని ఎండగట్టాలని అఖిలపక్ష నేతలు ఉద్ఘాటించారు. అవసరమైతే తిరుపతి ఎంఎల్ఏ, టిటిడి ఛైర్మన్ భూమన కరుణకర్రెడ్డి అఖిలపక్షపార్టీలను సిఎం వద్దకు తీసుకెళ్లయినా సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం వద్ద జరిగిన ధర్నాలో అఖిలపక్షం నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధికి ఒక్కశాతం నిధులను టిటిడి పాలకమండలి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం సమంజసం కాదని విమర్శించారు. తిరుపతి అభివద్ధి వేదిక కన్వీనర్ టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళి (సిపిఎం), పి. మురళి (సిపిఐ), ఆర్. హరికష్ణ (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ) పి.అంజయ్య (ఆర్ పిఐ) నీరుగట్టు నగేష్, వెంకటాచలపతి (ఆమ్ ఆద్మీ) డిఎంసి భాస్కర్ (కాంగ్రెస్) ఆర్కాట్ కష్ణ ప్రసాద్ (బిఆర్ఎస్) తదితరులు ప్రసంగించారు. బిజెపి, విహెచ్పిల ధర్నా పోస్టర్లకు భయపడి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టిటిడి బోర్డు ప్రతిపాదనను తిరస్కరించడాన్ని వారు తప్పుబట్టారు. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారని భయపడి జగన్మోహన్రెడ్డి ఈ రకంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. తిరుపతి ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తక్షణం తిరస్కరణపై పున్ణపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. టిటిడి లాంటి ధార్మిక సంస్థ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలని సూచించారు. 4,500 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న టిటిడికి ఒక్కశాతం నిధుల కేటాయింపు పెద్ద విషయం కాదన్నారు. దీనిని చట్టంగా మార్చడం ద్వారా భవిష్యత్ అవసరాలు ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా తిరుపతి అవసరాలు తీర్చుకోడానికి తోడ్పడుతుందన్నారు. తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధులు సాధించేంత వరకూ వివిధ రూపాల్లో ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు జయచంద్ర, సాయిలక్ష్మి, జి. బాలసుబ్రమణ్యం, కేఎన్ఎన్ ప్రసాదరావు, రామకష్ణ, ముని రాజ, సురేష్ , ముకేష్ ,చిరంజీవి ,గజేంద్ర, సిపిఐ నేతలు రాధాకష్ణ, చిన్నం పెంచలయ్య శ్రీరాములు,ఎన్ డి రవి, కవి రచయిత గొడుగు చింత గోవిందస్వామి, బిఆర్ఎస్ నేత బెల్లంకొండ సురేష్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు వెంకయ్య, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో ప్రసంగిస్తున్న కందారపు మురళి










