Nov 07,2023 22:53

సమావేశంలో మాట్లాడుతున్న బిసి సంఘ నాయకులు


ప్రజాశక్తి-గిద్దలూరు
గిద్దలూరు ఎమ్మేల్యే అన్నా రాంబాబు మాట తప్పుతున్నారని, బిసిలను అణచివేసే ప్రయత్నంలో ఉన్నారని గిద్దలూరు నియోజక వర్గం బీసీ సంఘాల నాయకులు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై ద్వజమెత్తారు. స్థానిక జ్యోతిరావుపూలే పార్కు వద్ద గిద్దలూరు నియోజకవర్గం బీసీ సంఘాల నాయకులు బీసీ సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్నిచోట్ల బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్‌ పదవులు కట్ట బెడుతుండగా, గిద్దలూరు నియోజకవర్గంలో మాత్రం అధిక శాతం ఓటింగ్‌ గలిగిన బీసీలకు ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు .బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ బీసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్‌ కోసం 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న భవనం ఎర్పాటు చేసుకోలేక పోతున్నామన్నారు. భవన నిర్మాణానికి అనుమతి నిధులు మంజూరై ఆగిపోవటం దురదృష్టకరమన్నారు. గిద్దలూరు నగర పంచాయతీ ఎన్నికల సమయంలో గిద్దలూరు మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ పదవి కటారు అరుణ్‌ కుమార్‌ యాదవ్‌కు ఇస్తామని బీసీ సంఘనాయకుల, మీడియా సమక్షంలో ఎమ్మెల్యే, అన్నా రాంబాబు మాట ఇచ్చి ప్రస్తుతం మాట తప్పు తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మా బీసీలు, మా ఎస్సీలు మా ఎస్టీలు అంటున్నారే కానీ గిద్దలూరు నియోజకవర్గంలో దానికి విరుద్ధంగా బీసిల పట్ల అధికార వైసీపీపార్టీ ప్రవర్తిస్తున్నదన్నారు. ఇకనైనా నియోజకవర్గంలో బీసీలకు న్యాయం జరిగే లాగా చూడాలని, అలా జరగని పక్షంలో రాబోవు ఎన్నికల్లో వైసిపి పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు కంచర్ల కోటయ్య గౌడ్‌, కటారు రాజా అరుణ్‌ కుమార్‌ యాదవ్‌, తోండమల్లు బ్రహ్మయ్య, ఆకుమల్ల కోటేశ్వరరావు, దండు సోమయ్య, జంగాల చెన్నయ్య, కుంచాల రామయ్య, కొత్తకోట పెద్దిరాజు నల్లబోతు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.