Nov 06,2023 22:29

చిత్తూరు అర్బన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు రోజుల్లో బిఎల్వోలు సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో నిర్దేశించిన సమయంలో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఏఈఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ స్పష్టం చేశారు. షర్మన్‌ బాలికల పాఠశాలలోని 26, 45, 47, 50 పోలింగ్‌ కేంద్రాల్లో నవంబర్‌ 4, 5వ తేదీల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాలు జరుగుతున్న తీరును ఏఈఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రం వద్ద ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, సీఎంఎం గోపి, బిఎల్వో లు పాల్గొన్నారు.
ఓటు హక్కు నమోదు పౌరుల బాధ్యత
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవడం ఒక బాధ్యతగా గుర్తించాలని ఏఈఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ చెప్పారు. సోమవారం చిత్తూరులోని రుక్మిణి కష్ణస్వామి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల సవరణ -2024 లో భాగంగా 18 సంవత్సరాలు పూర్తయిన వారికి ఓటరుగా నమోదు, అవగాహన కార్యక్రమంలో ఏఈఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... విద్యార్థులు ఇప్పటివరకు ఓటు హక్కు, పార్లమెంట్‌, అసెంబ్లీ వంటి అంశాలను పుస్తకాల్లో చదువుకొని ఉంటారని, ప్రస్తుతం 18 సంవత్సరాలు పూర్తయినందున ఇక ఒక బాధ్యతాయుత ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం మొదటగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవడం ద్వారా మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే అవకాశాన్ని పొందుతారన్నారు. జనవరి 1 , 2024 కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారంతా కచ్చితంగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఇందుకోసం కళాశాల స్థాయిలోనే అధికారులు, బిఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. ఫారం -6 దరఖాస్తులను పూర్తిచేసి ఓటు హక్కు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, కళాశాల ప్రిన్సిపల్‌ రమేష్‌ బాబు, ఆర్వో గోపాలకష్ణ వర్మ, ఆర్‌ఐ అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.