Jul 19,2023 20:33

ఆదోనిలో మాట్లాడుతున్న రామాంజనేయులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పెండింగ్‌లో ఉన్న బైపాస్‌ రోడ్డు పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆదోని, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31 వరకు ఆదోని నుంచి కర్నూలు కలెక్టరేట్‌కు జరిగే మహా పాదయాత్ర జయప్రదం చేయాలని ఆదోని పట్టణంలో మట్కార్‌ గేరి, ఫరిస్సా మొహల్లా, వెంకన్నపేట, చిన్న మార్కెట్‌ ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా నుంచి రాజకీయంగా అత్యున్నత పదవులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఇలా ఎన్నో పదవులు పొందినా కర్నూలు జిల్లా అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు. ఆదోని ఒకప్పుడు పరిశ్రమలతో కళకళలాడుతూ ఉండేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న మహా పాదయాత్రకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ నాయకులు గోపాల్‌, తిప్పన్న, వీరేష్‌, శ్రీనివాసులు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.