అనంతపురం కలెక్టరేట్ : బాల్య వివాహాలు లేని జిల్లాగా అనంతను మారుద్దామని బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ సభ్యులు రాజేంద్రప్రసాద్ తెలిపారు. అనంతపురం నగరంలోని పెన్నర్ భవన్ సమావేశ భవనంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలన్నారు. ఏ ఒక్కరూ డ్రాప్ అవుట్ అవ్వడానికి అవకాశం లేదన్నారు. బడిబయట ఉన్న పిల్లలని సీఆర్పీల చేత సర్వే చేయించి బడిలో చేర్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు అందరి చేత కమ్యూనిటీ లెవెల్ అవేర్నెస్లు ఏర్పాటుచేసి విద్య ప్రాముఖ్యతను తెలియజేసి, పిల్లలను చదువుకు పంపేలాగా పేరెంట్స్ను ప్రోత్సహించాలని వారు పేర్కొన్నారు. బాల్యవివాహాలు లేని జిల్లాగా అనంతపురంను తీర్చిదిద్దాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బిఎం.శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలకు రెండు మూడు రోజులు డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లలందరినీ గుర్తించి బాల్య వివాహం జరిగే అవకాశం ఉన్నట్లయితే వెంటనే వాళ్లని అక్కడి నుంచి తీసుకొచ్చి పునరవాసం కల్పించాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని పాఠశాలల్లోనూ ప్రధానోపాధ్యాయుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు జిల్లా బాలల పరిరక్షణ సమితి చైల్డ్ హెల్ప్ లైన్ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, సిడబ్ల్యూసి ఛైర్పర్సన్ మేడా రామలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ సమితి డిసిపిఒ సుబ్రమణ్యం, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృష్ణమాచారి, కౌన్సిలర్లు సురేష్, ఇర్ఫాన్, డీసీపీయూ సోషల్ వర్కర్ వెంకట కుమార్ పాల్గొన్నారు.










