
బ్రోచర్ ఆవిష్కరణలో డిఇఒ పి.శ్యాంసుందర్
ప్రజాశక్తి - ఏలూరు
హేలాపురి బాలోత్సవం నాలుగవ పిల్లల సంబరాలు జయప్రదంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యాంసుందర్ ఆకాంక్షించారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అపుస్మా స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ సభలో హేలాపురి బాలోత్సవం 4వ పిల్లల సంబరాల బ్రోచర్ను డిఇఒపి శ్యామ్ సుందర్, తపన ఫౌండేషన్ ఛైర్మన్ తపన చౌదరి, అపుస్మా ఏలూరు జోన్ కమిటీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్, తపన చౌదరిలు మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ, వివిధ సంఘాల పెద్దలు బాలోత్సవాలు ఏర్పాటు చేయడం గొప్ప అనుభూతి కలుగుతుందన్నారు. బాలోత్సవాల నిర్వహణకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. హేలాపురి బాలోత్సవ ఆహ్వాన సంఘం నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ డిసెంబర్ 16, 17 తేదీల్లో సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లో నిర్వహించే 4వ పిల్లల సంబరాలకు ఏలూరు పరిసర 6 మండలాల నుంచి, 575 స్కూల్స్ నుంచి, ఎల్కెజి నుంచి 10వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు 69 అంశాలలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించే అవకాశం ఉందని వివరించారు. విద్యార్థులు, పెద్దలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై.ఆనందనాయుడు, పి.ఆంజనేయులు, వి.సురేష్, అపుస్మా రాష్ట్ర నాయకులు ఎంబిఎస్వి.శర్మ, జోన్ అధ్యక్షులు కెసిహెచ్.చంద్రశేఖర్, కార్యదర్శి ఎన్ఆర్కెఎ.ప్రసాద్, విజయలక్ష్మి, మదన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.