ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అరెస్టు చేయాలని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పుంగనూరు, భీమవరంలో హింసను ప్రేరేపించడమే కాకుండా, లా అండ్ ఆర్డర్ను సవ్యంగా నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి, వారి రక్తం కళ్ల చూశారని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు సహనం కోల్పోయి కాల్పులు జరుపుతారని, అలా కాల్పులు జరిగితే.. కొందరైనా మరణిస్తే.. వారి శవాలతో శవ రాజకీయం చేయాలని బాబు, లోకేష్ల తాపత్రయమని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి, గొడవలు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే 2024 ఎన్నికల్లో టిడిపి గెలవలేదని తెలుసుకొని ఒత్తిడికి లోనై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
సమావేశంలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి










