
''భారతదేశ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఒక మతం వారు ఇతర మతం వారిని బద్ద శత్రువులుగా చూస్తున్నారు. నేడు దేశ భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. ఈ మత రాజకీయాలు భారతదేశాన్ని దెబ్బతీశాయి. ప్రపంచ వేదికపై భారతదేశానికి సిగ్గుచేటుగా పరిణమించాయి. సామాన్య ప్రజలపై సాగుతున్న దారుణాల నుండి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే నాయకులు ప్రయత్నిస్తున్నారు.'' నేటి దేశ పరిస్థితిని వర్ణించడానికి సరిపోయే మాటలివి. అయితే ఈ మాటలు ఇప్పటివి కావు. నేటికి 96 సంవత్సరాల క్రితం 1927లో.. పంజాబ్ నుండి వెలువడే 'కీర్తి' అనే పత్రికలో ప్రచురించబడిన ''మత ఘర్షణలు, వాటి నివారణ'' వ్యాసం లోని మాటలివి. ఆ వ్యాస రచయిత పేరు షహీద్ భగత్సింగ్! విప్లవ వీరుడిగా.. చిరుప్రాయంలోనే దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబమెక్కిన త్యాగధనుడు. ఆ నాడే మతోన్మాద రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించాడన్న వాస్తవం నేడు చాలా మందికి తెలియదు.
బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి భారత దేశాన్ని విముక్తం చేయడానికి 23 ఏళ్ల చిరు ప్రాయంలోనే ప్రాణార్పణ గావించిన అమరవీరుడు షహీద్ భగత్సింగ్. 1931, మార్చి 23న నాటి బ్రిటిష్ పాలకులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను లాహోర్ జైలులో ఉరితీశారు. పరాయి పాలకులను దేశం నుండి తరిమికొట్టాలనే ఆకాంక్షతోనే ఆగి పోకుండా.. స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తే ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంలోనూ సమగ్ర దృక్పథం కలిగిన కొద్దిమంది స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో భగత్సింగ్ ఒకడు. ఆయన 28 సెప్టెంబర్, 1907న నేటి పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ జిల్లా, బంగా గ్రామంలో జన్మించాడు. యుక్త వయస్సులోనే స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 'పంజాబ్ కేసరి' లాలా లజపతిరారు నాయకత్వంలో నాడు ఉధృతంగా కొనసాగుతున్న విప్లవకర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. నాటి యువతను ఉత్తేజపరిచిన నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు.1928లో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ లాలా లజపతిరారు నాయకత్వంలో పెద్దయెత్తున ధర్నాలు, హర్తాళ్లూ కొనసాగాయి. లాహోరులో జరిగిన నిరసన ప్రదర్శనపై విరుచుకుపడిన బ్రిటిష్ పోలీసులు లజపతిరారును లాఠీలతో తీవ్రంగా గాయపరిచారు. నవంబర్ 17న ఆయన ఆస్పత్రిలో కన్నుమూశాడు. లాలాజీ మరణానికి కారకుడైన బ్రిటిష్ పోలీసు అధికారి స్కాట్ను చంపాలనుకున్న భగత్సింగ్ మిత్రబృందం సాండర్స్ను చంపారు. దేశ ప్రజల్లో విప్లవ భావాలు మరింతగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో.. 1929 ఏప్రిల్ 8న భగత్సింగ్, బటుకేశ్వరదత్తులు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పేల్చారు. ప్రాణనష్టం జరగని రీతిలో బాంబులు వేసి, నినాదాలిస్తూ, కరపత్రాలు పంచుతూ అక్కడే నిల్చుండి అరెస్టయ్యారు. అసెంబ్లీపై బాంబు దాడి కేసుతో పాటు, సాండర్స్ హత్యకేసును తిరగదోడిన బ్రిటిష్ ప్రభుత్వం భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు ఉరిశిక్ష వేసింది.
గాంధేయ మార్గానికి భిన్నంగా విప్లవ కార్యాచరణ ద్వారా దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది వీరపుత్రులు ఉద్యమించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వీరు నెరపిన పోరాటం కూడా సముజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఈ తరహా విప్లవ వీరుల్లో షహీద్ భగత్సింగ్ది విశిష్టస్థానం. దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సాధించడంతోనే ఆగిపోకుండా, స్వతంత్ర భారతానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా సిద్ధించాలని, సామాన్యుడి సంక్షేమం సాకారం కావాలంటే దేశం సామ్యవాద పంథాను అనుసరించాలనే దృక్పథంతో ఉద్యమించిన వీరుడు భగత్సింగ్.
పద్దెనిమిదేళ్ల చిరుప్రాయానికే వివిధ రాజకీయ విధానాలకు సంబంధించిన అధ్యయనంలో భగత్ మునిగిపోయాడు. సింక్లేర్, విక్టర్ హ్యూగో, దాస్తోవస్కీ, బుకారిన్, మార్క్స్, లెనిన్ రచనలను విస్తారంగా చదివాడు. ఈ విస్తృత అధ్యయనం వెలుగులో.. ప్రజాస్వామ్యం, హేతువాదం, సామ్యవాద వ్యవస్థ సాధన కోసం తన రాజకీయ కార్యాచరణ కొనసాగాలని నిర్దేశించుకున్నాడు. 'ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి.. పీడించే సాంఘిక ధర్మాని'కి ముగింపు పలకడమే తన రాజకీయ లక్ష్యంగా భగత్సింగ్ ప్రకటించాడు. తెల్లోడిని తరిమికొట్టి నల్లోడికి అధికారం కట్టబెట్టడమే, స్వాతంత్య్ర పోరాట ఉద్దేశం కాదని భగత్సింగ్ తెగేసి చెప్పాడు. అన్ని రకాల పీడనలకు అంతం పలికినప్పుడే భరతమాతకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని గాఢంగా విశ్వసించాడు. నాడు భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ మొదలగు విప్లవకారుల వేదికగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కొనసాగేది. భగత్సింగ్ చొరవతో సంస్ధ పేరు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. 'వందేమాతరం' నాటివరకు విప్లవకారుల రణన్నినాదంగా ఉండేది. భగత్సింగ్ రాకతో 'ఇంక్విలాబ్ జిందాబాద్' తోడైంది. భవిష్యత్తు భారతం ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన దృక్పథం గల విప్లవకారుడు భగత్సింగ్. పల్లెల్లోని రైతులను, ఫ్యాక్టరీల్లోని కార్మికులను చైతన్య పరచినప్పుడే దేశంలో సమ సమాజం సిద్ధిస్తుందని కలలు కన్నాడు. దోపిడీ వ్యవస్థలన్నీ సమూలంగా అంతమయ్యే వరకు స్వాతంత్య్ర పోరాటం కొనసాగాల్సిందేనని ఆయన తన సహచరులకు చెబుతుండేవాడు.
భగత్సింగ్ ప్రాపంచిక దృక్పథంలో హేతువాదం కీలకాంశంగా నిలిచింది. మతం, మానవ పరిణామం, సమాజ పరిణామం మొదలగు అంశాలను భగత్ శాస్త్రీయంగా విశ్లేషించేవాడు. అన్ని రకాల మూఢాచారాలను తీవ్రంగా నిరసించేవాడు. సమాజంలోని ప్రతీ అంశాన్ని హేతుబద్ధ ఆలోచనా సరళితో విశ్లేషించి అవగతం చేసుకోవాలని యువతకు బోధించే వాడు. స్వాతంత్య్ర సముపార్జన కోసం మిలిటెంట్గా ఉద్యమిస్తున్న తరుణంలోనే ప్రజల పోరాట శక్తిని బలహీనపరిచే మత రాజకీయాల దుష్ట స్వభావాన్ని భగత్సింగ్ స్పష్టంగా గుర్తించగలిగాడు.
మత రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకిం చాలని తమ సంస్థ సభ్యులకు నిర్దేశించేవాడు. భగత్సింగ్ స్థాపించిన యువజన సంఘం 'నౌ జవాన్ భారత్ సభ'లో మతోన్మాద భావజాలమున్నవారికి ప్రవేశం నిషిద్ధం. మతాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని, ప్రజల్లో మత సామరస్యం పెంపొందించేలా సభ్యులు కృషి చేయాలని సంఘం నియమావళిలో పొందుపర్చారు. తాము ఎంతగానో ఆరాధించిన లజపతిరారు.. ఒక దశలో మత రాజకీయాలకు పాల్పడినప్పుడు భగత్సింగ్...తమ గురువునే ఎదిరించాడు.
సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణ తర్వాత లజపతిరారు క్రమంగా మతవాద రాజకీయాల వైపు మరలాడు. 1924 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు తమ గురువును, ఆయన మత రాజ కీయాలనూ ఓడించాలంటూ భగత్సింగ్, అతని సహచరులు ప్రచారం చేశారు. లాలా లజపత్ రారు అవకాశవాద వైఖరిని ఎండగడుతూ ''దారి తప్పిన నాయకుడు'' పేరుతో ఒక కరపత్రం విడుదల చేసారు. పత్రికల వాళ్లు ప్రశ్నించినపుడు.. ''కానీయనివ్వండి, వారెవ్వరో కాదు.. మేరే నాలాయక్ బేటేహీ హై!'' అని సమాధానమిచ్చాడట లజపతిరారు. మత రాజకీయాలను భగత్సింగ్ ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడో.. ఈ సంఘటన రుజువు చేస్తుంది.
పైన ఉదహరించిన 'కీరి'్త పత్రిక వ్యాసంలోనే.. ''ప్రజల మధ్య అనవసర గొడవలు నిరోధించడానికి.. ప్రజల్లో శ్రామిక వర్గ ఐక్యతను, అసలు సమస్యలపై ఉద్యమించే చైతన్యాన్ని పెంపొందించడం చాలా అవసరం'' అని భగత్సింగ్ స్పష్టీకరించాడు. వలసవాద సంకెళ్లను ఛేదించడం కోసం మతం, కులం మొదలైన విభజనలకు అతీతంగా ప్రజల ఐక్యతను సాధించాలి. కలకత్తా నగరంలో మత ఘర్షణలను అడ్డుకోవడానికి.. హిందూ, ముస్లిం వర్గాల కార్మికులు చేతులు కలిపి, మతోన్మాదులను ఐక్యంగా ఎదుర్కొన్న వైనాన్ని ఉదహరించిన ఆయన.. సామాజిక విభజనలను అధిగమించిన శ్రామికవర్గ చైతన్యం తోనే ప్రజల ఐక్యత సాధ్యమని ఆయన తేల్చిచెప్పాడు. గదర్ వీరులు మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసి, మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించారని.. మతోన్మాద ప్రమాదాన్ని నిలువరించడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారమని భగత్సింగ్ పేర్కొన్నాడు. ''వలసవాదం లాగా మతతత్వం సైతం దేశ ప్రజలకు పెద్ద శత్రువు'' అంటూ తన సహచరులకు చెబుతుండేవాడు.
కానీ నేడు దేశంలో ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు విశృంఖలంగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది సామాన్య ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన పాలకులు కొద్దిమంది పెట్టుబడిదారుల సేవలో తరిస్తున్నారు. వీటిని చూస్తుంటే షహీద్ భగత్సింగ్ కలలుగన్న సమసమాజం ఈ దేశంలో ఇంకా అందనంత దూరంలోనే ఉండిపోయిందని అర్థమవుతోంది. స్వాతంత్య్ర సమర వీరులు కలలుగన్న సమ సమాజాన్ని నిర్మించడానికి.. షహీద్ భగత్సింగ్ తాత్విక చింతనను, ఆయన ఆశయాలను కొనసాగించడమే సరైన పరిష్కారం.
(నేడు షహీద్ భగత్సింగ్ జయంతి)
/ వ్యాసకర్త : ఆర్. రాజేశమ్, 9440443183/