
- నేడు జాషువా 128వ జయంతి
'రాజు మరణించే నొకతార రాలిపోయే / సుకవి మరణించే నొకతార గగనమెక్కే / రాజు జీవించు రాతి విగ్రహములందు / సుకవి జీవించు ప్రజల నాల్కల యందు' అంటూ జాషువా...రాజుకు, సుకవికి తేడాను వివరిస్తూ రాసిన ఈ పద్యం వినని, చదవని కవి అంటూ తెలుగు నేలపై ఉండరని నేను అనుకుంటాను.
భారతీయ సాహిత్యంలో కవిది ప్రథమ స్ధానం. ఇంకా చెప్పాలంటే సృష్టికర్తతో సమానం. సంస్కృతంలో కాళిదాసుకు ఎంత పేరుందో తెలుగులో జాషువాకు అంత పేరుంది. కాళిదాసును కవికుల గురువు అంటారు. దాదాపు అదే స్థానం జాషువాకు కూడా లభించింది. సంస్కృత వాజ్మయం కాళిదాసు మయమైతే తెలుగు వాజ్మయం జాషువామయం.
అలాంటి జాషువా కుటుంబం ఎంత పేదరికం అనుభవించిందనడానికి కింది ప్రస్తావన ఒక ఉదాహరణ మాత్రమే.
సంక్రాంతికి, ఉగాదికి, దసరాకు కొత్త బట్టలు ధరించటం, పండుగను ఘనంగా చేసుకోవటం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. అలాగే జాషువా ఊళ్ళో కూడా ఒక పండుగ రోజున తోటి పిల్లలు, పెద్దలు చాలామంది కొత్తబట్టలు ధరించి, తాజాగా చేసిన పిండివంటలు తింటూ కనిపించారు. చిన్నవాడైన జాషువా, తమ్ముడు ఇశ్రాయేలు ఇద్దరూ తమకు కొత్త బట్టలు కావాలని, మిఠాయి పెట్టమని తల్లిని మారాము చేయసాగారు. తల్లి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటిలో సరుకులు నిండుకున్నాయి. పిల్లల దీనాలాపాన వింటే తల్లి హృదయం పిండి వేసినట్లయింది. పిల్లలను వెంట తీసుకొని అప్పైనా పుడుతుందేమోనని, ఊరిలోని కొట్టుకు వెళుతోంది. ఒక వీధిలో ఒక చిన్న పాప పళ్ళెం నిండా ఏవో తినుబండారాలు తీసుకొనిపోతూ వుండగా కొన్ని కిందబడ్డాయి. ఆ బాలిక వాటిని చూసుకోకుండా అలాగే వెళ్ళిపోయింది. అది చూచిన జాషువా.. వెంటనే వెళ్లి ఆ కింద పడిన వస్తువును అపరిశుభ్రం అన్న విషయానికి కూడా తావు ఇవ్వక తీసుకున్నాడు ఆనందిస్తూ. తల్లి చూచింది. 'అది తప్పు అనటానికి కూడా ఆమెకు నోరు రాలేదు' చూడండి. జాషువా తన బాల్యంలో ఎంతటి పేదరికం అనుభవించాడో.
తను కవిత్వం రాసే తొలినాళ్ళలో ఎన్ని అవమానాలు పొందాడో చూడండి. ఒకసారి జాషువా రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. అదే కంపార్ట్మెంట్లో వున్న పండితుడు జాషువా చేతిలో వున్న పుస్తకాలు చూచి, ఆయన కవి అని గుర్తించి కవిత్వం వినిపించమని కోరాడు. జాషువా స్వీయ కవిత్వం వినిపించాడు. భేష్ ! భేష్ !! మీ కవిత్వం అద్భుతం, మీది ఏ కులం అని ప్రశ్నించాడు.
'నేను క్రైస్తవుణ్ణి' అని జవాబిచ్చి ఆ తరువాత 'కవికి గానీ, కళకు గానీ కులమతాలున్నాయా?' అని ప్రశ్నించాడు జాషువా. 'అయ్యయ్యో! వాణి అంటుపడ్డది' అంటూ చివుక్కున లేచిపోయి మరోచోట కూర్చున్నాడు ఆ పండితుడు.
ఈ సంఘటన జాషువా హృదయాన్ని కలచివేసింది. తన ఆవేదనను మానితరావు వేంకట కుమార మహీపతి సూర్యరా య వారికి (పిఠాపురం రాజావారికి) నివేదించుకున్నాడు. ఏమని నివేదించుకున్నాడు: ''నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే/ ఖా కమనీయ వైఖరులుగాంచి ''భళీ! భళి'' యన్నవాడె ''మీ/దేకుల'' మన్న ప్రశ్న వెలయించి, 'చివాలున లేచి పోవుచో/ బాకున గ్రుమ్మినట్లగును పార్థివ చంద్ర! వచింప సిగ్గగున్' అంటాడు జాషువా.
జాషువా కవిగా ఉజ్వల దశలో వున్నప్పుడు కూడా కొన్ని వ్యథా ఘట్టాలు ఎదుర్కోక తప్పలేదు. అలాంటి వాటిలో కాకినాడ సభ ఒకటి. 'కోరిక కాకినాడ సభకుం జనినాడను... భూరి కవీంద్ర గోష్టికిని బోయితి, నా గరిమన్ హేళన చేసె నొక్కకవి ధిక్కారంబు గావించుచున్' అని జాషువా తనని అవమానించిన ఆ కవి ధిక్కారానికి తల వంచలేదు. పౌరుషంతో, సంపూర్ణమైన ఆత్మ విశ్వాసంతో తనని అవమానించే వారి నోళ్ళను శాశ్వతంగా మూయించే పద్యం చెప్పాడు.
''గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న/న్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే/ యివ్వసుధాస్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంటమూనెదన్ /రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్'' అని పద్యంతోనే సమాధానమిస్తాడు జాషువా.
జాషువా జీవితంలో ఇటువంటి ఎదురుదెబ్బలు ఎన్నో తగిలాయి. వీటికి ఆయన భయపడలేదు. రాటుదేలాడు. జీవితంలోని ప్రతి సన్నివేశం లోంచి ఆయన కవిత్వాన్ని దర్శించాడు. ఆయన జీవిత వాంఛ కవిత్వ రూపంలో నెరవేరింది. కవిత్వమే ప్రధానాంశంగా బతికిన జాషువా అందుకోసం ఎంతో సంఘర్షణకు గురికావాల్సి వచ్చింది. ఆర్థికంగా, మానసికంగా ఎన్నో కష్టాల్ని వ్యథా ఘట్టాల్ని చూడవలసి వచ్చింది
ఇలాంటిదే మరో సంఘటన: అవధానిగా ప్రసిద్ధిగాంచిన కొప్పరపు సుబ్బారావు కవి ఒకసారి వినుకొండకు వచ్చారు. ఆయన గౌరవార్థం కవులంతా కలిసి వినుకొండ ఊళ్ళో సభ ఏర్పాటు చేశారు. కవుల మీద, కవిత్వం మీద ఉన్న గాఢమైన అభిమానం కారణంగా జాషువా 'కొప్పరపు' కవిపై అభినందన పద్యాలు రాశాడు. ఆ కవికి పద్యాలు ఎలా అందజేయాలా అని మధనపడుతూ ఉంటే, ఒక బ్రాహ్మణ మిత్రుడు జాషువా అవస్థ గుర్తించి, చెయ్యి పట్టుకొని సభలోకి తీసుకెళ్ళి కవిగారితో పరిచయం చేయించాడు. తన మీద ఒక స్థానిక యువకవి రాసిన పద్యాలు చదివి 'కొప్పరపు' కవి ఎంతో సంతోషించాడు. ఈ లోపు సభలో పెద్ద అలజడి మొదలయ్యింది. నిమ్నజాతి వాడు ఈ సభలోకి ఎలా వచ్చాడని దుర్భాషలాడుతూ జాషువాను అనిమానించినప్పుడు..ఆ అవమాన భారంతో బయటపడి...ఆ రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా గడిపాడు జాషువా. జాషువా ఈ అవమాన భారం లోంచి తేరుకోవడానికి కవిత్రయం రాసిన మహాభారతం చదివాడు. కుమారాస్త్రం ఘట్టంలో కర్ణుడితో తనని అన్వయం చేసుకున్నాడు. కర్ణుడితో తనను, తనలో కర్ణుడిని చూసుకున్నాడు.
జాషువా తొలి కవితా ప్రయత్నాలకు దోహదకారులైన వ్యక్తుల్లో తోలేటి సుబ్బారావు పాత్ర మరువలేనిది. వారి ప్రోద్బలంతోనే రాజమండ్రిలోని చింతామణి నాటక మండలి యజమాని సత్యవోలు గున్నేశ్వర రావుని కలిసి చింతామణి నాటక మండలిలో రచయితగా కుదురుకున్నారు. గున్నేశ్వరరావు ప్రోద్బలంతో 'రుక్మిణీ పరిణయం' అనే తన తొలి నాటకం రాశారు. అంతేకాక, కాశీనాథుని నాగేశ్వరరావు ప్రోత్సాహం వలన జాషువా రచనలు భారతి పత్రికలో విరివిగా అచ్చవుతూ ఉండేవి.
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి/ పంజరాన గట్టువడను నేను / నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు / తరుగు లేదు, విశ్వనరుడ నేను.
జాషువా తనను తాను ఆవిష్కరించుకున్న పద్యమే ఆయన అనుభవించిన మత సంఘర్షణకి ప్రతీకగా పై పద్యాన్ని చూడవచ్చు. జాషువా వ్యక్తిత్వంలోను, కవిత్వంలోనూ వచ్చిన పరిణామానికి ఈ పద్యాన్ని తార్కాణంగా చెప్పవచ్చు.
ఒక దృశ్య, శ్రవణ నాటకంలో ఒక వాతావరణాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో కవి ప్రతిభ...అనన్య సామాన్యంగా ఉండాలి. లేకపోతే ఆ నాటకం రక్తి కట్టదు. మరుభూమిలో సాధారణంగా కనిపించే ఒక వాతావరణాన్ని జాషువా ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టారు.
సత్య హరిశ్చంద్రుడు రాజ్యాన్నంతా పోగొట్టుకున్న తరువాత కాశీకి వెళ్ళి...ఆఖరున కాటి కాపరి ఉద్యోగం చేశాడు. సర్వం సహా చక్రవర్తి అయినటువంటి సత్యహరిశ్చంద్రుడు విధి వశాత్తు వేదాంత ధోరణిలో పలికే మాటలను సత్య హరిశ్చంద్ర నాటకంలో జాషువా..హరిశ్చంద్రుడు పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసి రాసిన పద్యాలు ఆ నాటకానికే వన్నె తెచ్చాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
జాషువా కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ మొదలైన ఎన్నో బిరుదులు పొంది ఉండవచ్చు గాక, కానీ తాను మొదటి సన్మానంలో అందుకున్న పది సేర్ల పెసలు, తన స్వంత ఊరిలో మొదటిగా జరిగిన సన్మానంలో పొందిన 116 రూపాయల బహుమతి ఆయనకు గొప్ప అనుభూతి.
విస్పష్టమైన భావ వ్యక్తీకరణ జాషువా సొంతం. ఆయన ఒకానొక సందర్భంలో : 'జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు. పేదరికం. కులమత బేధం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాకు ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని, కులబేధాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోగలిచాను. వాటిపై కత్తి గట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం'. అంటాడు. మతము, కులము..మనిషిని ఎంత కుంగదీస్తాయో స్వానుభవంతో దెబ్బతిన్న పులి అయ్యాడు. అంటరానివాడు కవిత్వం రాయడం నేరమన్న వ్యవస్థని ధిక్కరించాడు.
జీవితంలో ఎన్నో అమానవీయ సంఘటనలను ఎదుర్కొన్న జాషువా...ఆ అమానవీయ సంఘటనలను తన రచనలలో మానవీయ దృక్పథంతో వెలువరించారు.
జాషువా రచనలు ప్రజాపక్షం. జీవితం పట్ల అభ్యుదయ దృక్పథం గలవాడు. మూఢాచారాలు, మత డాంబిక ఉత్సవాలు ఆయనకు గిట్టేవి కాదు. తన కుటుంబంలో కూడా ఇలాంటివి జరగడానికి ఇష్టపడేవాడు కాదు. తన రచనలలో ఉదారవాదిగా కనపడవచ్చు గాని ఆచరణలో ఆయన పూర్తి నాస్తికుడు. ఆయనలో కొన్ని తిరుగుబాటు లక్షణాలు కనబడతాయి. పాత విలువల్ని, కుహనా సంస్కృతుల్ని ధ్వంసం చేయాలనే పరిణామ దృష్టి ఆయనలో కనబడుతుంది. ఇందుకు ఉదాహరణగా హేమాలతా లవణంల వివాహమే.
కడు పేదరికం నుండి వచ్చిన వ్యక్తి పట్టుదలతో, కార్యదీక్షతో పద్మభూషణ్ దాకా ఎదిగి, ఎన్నో సాంఘిక సమస్యలను చాలా సరళమైన భాషలో అచ్చ తెలుగులో సమాజానికి పట్టి చూపి తెలుగు నేలపై తన ముద్రను దశాబ్దాలుగా పరిచిన జాషువాకు నివాళులు.
/ వ్యాసకర్త సెల్ :విల్సన్ రావు కొమ్మవరపు, 8985435515 /