
ప్రజాశక్తి-గిద్దలూరు
జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పట్టణంలోని కోటగడ్డ సచివాలయం పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అక్కడ పని చేస్తున్న వైద్య సిబ్బందితో వైద్యం అందిస్తున్న వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడే వైద్యం కోసం వచ్చిన వారిని పలకరించి ఏ విధంగా వైద్యం అందుతుందని ఆరా తీశారు. ఆయన కూడా అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి కావాల్సిన పరీక్షలు, మందులు అందించడంతో పాటు ఆపరేషన్లు చేయాల్సి వస్తే అందుకు తగిన సహకారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వై రామకష్ణయ్య, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్లు ఆర్డి రామకష్ణ, కాత దీపికా, కౌన్సిలరు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.