May 12,2023 23:09

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వచ్చిన అర్జీలకు త్వరగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. అధికారులందరూ బాధ్యతగా పనిచేసి రీ ఓపెన్‌ కేసులు పూర్తిగా పరిష్కరించి జీరో శాతానికి తీసుకురావాలన్నారు. స్పందన, రీ ఓపెన్‌ పిటీషన్లు, గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, కార్యక్రమాల కింద వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్‌ పిటీషన్లు 28 ఉన్నాయని, రీ ఓపెన్‌ అర్జీలు రాకుండా పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వ్యవసాయ శాఖకు సంబంధించి 7, పశుసంవర్ధక శాఖ నుంచి 4, విద్యుత్‌ శాఖకు చెందిన 4, గహ నిర్మాణ శాఖకు చెందిన 15 సివిల్‌ సప్లై నుంచి ఒకటి పంచాయతీ రాజ్‌ 10, రెవిన్యూ 10, పిటిషన్లు వచ్చాయని తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పేనాయక్‌ గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళిరెడ్డి, విద్యుత్‌ శాఖ ఎస్‌సి మోసెస్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, డిపిఒ విజరు కుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు.
కప్పలబండ అంగన్వాడీ కేంద్రం తనిఖీ
పుట్టపర్తి రూరల్‌ : చిన్నారులకు నాణ్యత కలిగిన భోజనం అందించాలని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కప్పలబండ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యత కలిగిన ఆహారం అందించడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ నవీన్‌ కుమార్‌, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.