ప్రజాశక్తి - పాచిపెంట : ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రకృతి సేద్య కషాయాలను తయారు చేసి తక్కువ ధరలకే రైతులకు అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. ఈ వనరుల కేంద్రాల్లో ద్రవ, ఘన జీవామృతం దశపత్ర కషాయం బ్రహ్మాస్త్రం, అగ్నిస్త్రం వంటి కషాయాలతో పాటుగా పంచగవ్య మీనామృతం వంటి పంటల పెరుగుదలకు ఉపయోగపడే ఉత్పత్తులతో పాటుగా జిగురు పళ్లాలు లింగాకర్షక బుట్టలు నవధాన్య విత్తనాలు కూరగాయల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. కావాల్సిన రైతులు ఆర్బికెల్లో ఉన్న ప్రకృతి సేద్య ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా పాంచాలి, రాయిగుడివలస ఆర్బికెల వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతులు కేవలం రసాయనాల మీద మాత్రమే ఆధారపడిపోకుండా ప్రకృతి వ్యవసాయాన్ని సాంప్రదాయ రసాయన సేద్యంతో మిలితం చేసి సాగు చేసినట్లయితే ఖర్చు తగ్గి నాణ్యమైన అధిక దిగబడులను పొందవచ్చుని తెలిపారు. రైతులంతా తాము పండించే అన్ని పంటలను ఈ పంటలో నమోదు చేసుకోవాలని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి వ్యవసాయ సిబ్బంది అందుబాటు లో ఉంటారన్నారు. కార్యక్రమంలో సిఆర్పి తిరుపతి నాయుడు, విఎఎ శ్రీను, సాయి, గణేష్, రైతులు పాల్గొన్నారు.
కె.వెంకటాపురంలో పొలంబడి
సీతానగరం : మండలంలోని కె.వెంకటాపురంలో వైయస్సార్ పొలంబడి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.అవినాష్ మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా సాధారణ పద్ధతుల్లో వరినాట్లును పరిశీలించారు. వీటి మధ్య ఉండే తేడాను గమనించి రైతులకు వివరించారు. రెండు మీటర్లకు నుండి రెండు పాయింట్ సెంటీమీటర్ల కాలిబాటలను తీస్తే గాలి, వెలుతురు బాగా రావడంతో ఎటువంటి తెగుళ్లు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయ న్నారు. ఇప్పటికే తాను పరిశీలించిన పొలాల్లో అగ్గి తెగుళ్లు వచ్చినట్లు గుర్తించి వాటికి నివారణకు జీరో పాయింట్ 6 ట్రై సైక్లోజోన్ తీసుకుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఇది సెప్టెంబర్ 15 వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి బుడితి శ్రీనివాసరావు, రైతులు లంక సూర్యసుబ్రహ్మణ్యం, బుడితి ముకుందరావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.










