Aug 16,2023 20:14

ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - మంత్రాలయం
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. బుధవారం తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 29 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు జరిగే రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహ మూర్తి, ఇఇ సురేష్‌ కోనాపూర్‌, సూపరింటెండెంట్‌ పురాణిక్‌తో చర్చించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అహ్మద్‌ వస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజును అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని పరిశీలించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు వస్తున్న విఐపిలు, భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్‌, వైద్య, గ్రామ పంచాయతీ వంటి శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించారు. డిప్యూటీ తహశీల్దార్‌ శశిశేఖర్‌ పాల్గొన్నారు.