Oct 19,2021 14:03

వాషింగ్టన్‌ : ఆపిల్‌ సంస్థ మార్కెట్లోకి ఏది రిలీజ్‌ చేసినా సంచలనమే. తాజాగా ఆపిల్‌ సంస్థ తమ ఐఫోన్ల స్క్రీన్లను తుడవడానికంటూ ఓ చిన్న క్లాత్‌ను రిలీజ్‌ చేసింది. ఈ కంపెనీ ఫోన్ల ధరలాగే.. ఈ క్లాత్‌ ధర చూస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం. ఆపిల్‌ లోగోతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ క్లాత్‌ ధర 19 డాలర్లు (రూ. 1424). అయితే భారత్‌లో ఆ సంస్థ దీని ధరను రూ. 1900గా నిర్ణయించింది. ఈ క్లాత్‌తో ఐఫోన్‌ 6 మొదలుకొని ఆ తర్వాత వచ్చిన అన్ని ఫోన్ల స్క్రీన్లను శుభ్రం చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. అయితే మార్కెట్లో ఈ క్లాత్‌కు భారీగా డిమాండ్‌ ఉన్నా.. అందుకు తగినట్లు సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడింది. సోమవారం రెండు కొత్త మ్యాక్‌బుక్‌ ప్రొ మోడల్స్‌ను రిలీజ్‌ చేస్తూ.. వాటితోపాటు ఆపిల్‌ సంస్థ ఈ క్లాత్‌ను కూడా తీసుకొచ్చింది.