ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్న అంగన్వాడీలపై పోలీసుల అక్రమ అరెస్టులు, నిర్భందాలు, వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గణేనాయక్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు సిఎం జగన్ ఇచ్చి హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పిన మాటను విస్మరించారన్నారు. అలాగే గ్రాట్యూటీ అమలు, వేతనాలు పెంపుదల కోరుతూ ప్రజా స్వామ్యబద్ధంగా చలో విజయవాడ మహాధర్నాకు వెళ్తుంటే ఇళ్ల వద్ద, బస్టాండ్, రైల్వేస్టేషన్లు, మార్గమధ్యలో ఎక్కడంటే ఎక్కడ అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడటం సరికాదన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అద్యక్ష ప్రదాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున మాట్లాడుతూ ముందస్తుగా నోటీసు తీసుకొని వెళ్లలేదంటూ పోలీసులు అంగన్వాడీలకు ఫోన్లు చేయడం ఇబ్బందికరంగా ఉందన్నారు. ఒత్తిళ్లకు గురై జరగరానివి జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తక్షణమే పోలీసులు వేధింపులు పాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఖరి మారకుంటే పోలీస్ స్టేషన్ల వద్ధకే వచ్చి ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
విలేకరులతో మాట్లాడుతున్న అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు










