
ప్రజాశక్తి-అమలాపురం రూరల్
యువత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని ఎంఎల్సి బొమ్మి ఇజ్రాయిల్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంబేద్కర్ భవనంలో మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ద్వితీయ వార్షికోత్సవాన్ని సంఘం అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం రెండేళ్లుపూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షులు, సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేయాలని దానికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అధ్యక్షురాలు రజనీ మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో సంఘాన్ని ఇంతవరకు విజయవంతంగా నడిపించామని అన్నారు. సుమారు 550 మంది వద్ధులు, అనాధలకు దుప్పట్లు, బ్రెడ్ లు అలాగే వికలాంగులకు ధన సహాయం చేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 300 మందికి ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందజేశామన్నారు. అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కిడ్నీ బాధితులకు ఆర్థిక సహాయం, ఉచిత కుట్టు మిషన్ శిక్షణలో భాగంగా సుమారు 75 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారు. ఇంకా పలువురు రాజకీయ నాయకులు, వివిధ దళిత సంఘాల నాయకులు, సామాజిక వేత్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ ఈ మహిళా సంఘాన్ని వాడవాడలా విస్తరింప చేయడంలో రజిని ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అనంతరం సంఘ సభ్యులచే మాతా రమాబాయి నాటిక, కోలాటాలను ప్రదర్శించారు. రజిని పోషించిన మాతా రమాబాయి పాత్ర ఆకట్టుకుంది. ఈ నాటికలో అంబేద్కర్ పాత్రధారి 'ప్రజాశక్తి' దినపత్రికను చదవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుణ్యమంతుల రజిని, ఆమె భర్త అర్జున్ రావు ఈ సందర్భంగా సంఘ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, సమనస సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, మాజీ ఎంఎల్ఎ అయితాబత్తుల ఆనందరావు, కారెం వెంకటేశ్వరరావు, ఇసుకపట్ల రఘుబాబు, గడ్డం సురేష్ బాబు, పెయ్యల పరశురాముడు, కమిడి ప్రవీణ్ కుమార్, ఎల్లమెల్లి హారతి, పొనుగుమాటి నరసింహమూర్తి, వడ్డి నాగేశ్వరరావు, ముంగండ ఆశీర్వాదం, చింతా రామకృష్ణ, రేవు తిరుపతిరావు, ఉండ్రు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.