Nov 06,2023 23:43

ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్‌ ఏర్పడిన దృశ్యం


ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌
జగనన్న సామాజిక సాధికార యాత్ర సందర్భంగా పట్టణానికి అమాత్యులు వస్తున్నారన్న కారణంతో పోలీసులు ఎక్కడికి అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం మార్కాపురం పట్టణ కేంద్రానికి వచ్చే దూర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా పట్టణానికి నడిబొడ్డున ఉన్న గడియార స్తంభా కూడలి వద్ద రహదారికి అడ్డంగా సభాస్థలి ఏర్పాటు చేయడంతో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోకి ఒక్కటంటే ఒక్కటి ఆర్టీసీ బస్సుకు అనుమతి లేకుండా పోలీసులు హుకుం జారీ చేయటంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు ముందస్తుగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ఎటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వకపోవడంతో వివిధ పనుల నిమిత్తం డివిజన్‌ కేంద్రమైన మార్కాపురం వచ్చిన ప్రజలు అడుగడుగునా పోలీసులు విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్వచ్ఛందంగా పాఠశాలలు మానిపించుకుని ఇళ్ల వద్దనే ఉంచుకున్నారు. మరికొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.