
సిపిఐ రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
అక్టోబర్ సోషలిస్టు విప్లవ స్ఫూర్తిని కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట, స్ఫూర్తి భవన్లో అక్టోబరు సోషలిస్టు విప్లవ దినోత్సవ సభ ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విప్లవాలకు, పోరాటాలకు దిక్సూచిలా కార్మికుల, కర్షకుల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చనే మహత్తర సందేశాన్ని అక్టోబర్ సోషలిస్టు ఉద్యమం లెనిన్ నాయకత్వాన చాటి చెప్పిందన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నాటి అక్టోబర్ సోషలిస్టు విప్లవ స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలన్నారు. ఏలూరు ఏరియా కార్యదర్శి హేమ శంకర్ మాట్లాడుతూ మహాత్తర సోషలిస్టు విప్లవం రష్యాలో విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలకు ఒక నూతన స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఆ విప్లవం విజయవంతమై 105 సంవత్సరాలు పూరైన సందర్భంగా నాయకులు, పార్టీ సభ్యులు ఆ విప్లవ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, ఎంఎ.హకీమ్, పొట్టేలు పెంటయ్య, గోర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మీ, భవాని, జోజీ మేరీ, ప్రభావతి, స్వప్న, రషీద్, శాయన అభిలాష్ కుమార్, యర్రా వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.