
న్యూఢిల్లీ : ఉమ్మడి సివిల్కోడ్ (యుసిసి) అమలును వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఎఐఎంపిఎల్బి) లా కమిషన్కి తెలిపింది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమని, దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలనే దురుద్దేశంతో రూపొందించినట్లు పేర్కొంది. ఈ దశలో ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని, అవసరంలేదని 2018లో 21వ లా కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనపై మరోసారి తాజా నివేదికలు సమర్పించాలని గత నెలలో 22వ లా కమిషన్ కోరింది.
ఎఐఎంపిఎల్బి నివేదికలోని 74వ పేజీని జాతీయ మీడియాకి విడుదల చేసింది. ఈ ప్రతిపాదనపై లా కమిషన్ తాజాగా నివేదికలు కోరడాన్ని ఎఐఎంపిఎల్బి విమర్శించింది. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశమని, చట్ట పరమైన అంశమని వెల్లడించింది. ఇటువంటి అంశాన్ని రాజకీయ లబ్థి కోసం, మీడియాలో అసత్యప్రచారాల కోసం వినియోగించడం సరికాదని పేర్కొంది. గతంలో లా కమిషన్ ఇప్పటికే నివేదికలను కోరిందని, వ్యక్తి గత చట్టాలను పరిశీలించిందని పేర్కొంది. లా కమిషన్ ఏం చేయాలనుకుంటుందనే దానిపై ఎలాంటి ముసాయిదా సమర్పించకుండానే మరోసారి లా కమిషన్ నివేదికలు కోరడమేమిటని ప్రశ్నించింది. ప్రస్తుత లా కమిషన్ ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించింది. వ్యక్తిగత చట్టాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి గతంలో లా కమిషన్కి బోర్డు నివేదిక సమర్పించిందని, దానిని లా కమిషన్ ఆమోదించిందని, సమర్థించిందని ఎఐఎంపిఎల్బి సభ్యుడు మౌలానా ఖలీద్ మీడియాకి వెల్లడించారు. ఐదేళ్ల అనంతరం మరోసారి ఈ ప్రతిపాదనను ఎందుకు లేవనెత్తారని, నివేదికలు కోరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ప్రస్తుతం భారతదేశంలో ముస్లింలు భయంకరమైన హింసను, వివక్షను ఎదుర్కొంటున్నారు. నిరంతరం దాడుల మధ్య భయంగా జీవిస్తున్నారు. అలాగే ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మత పరంగా విభజనను సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనపై ముస్లిం వ్యక్తిగత చట్టాలను దృష్టిలో ఉంచుకుని చర్చలను లేవనెత్తడం వారి గుర్తింపుపై జరుగుతున్నదాడిగా భావించాల్సివుంటుందని ఎఐఎంపిఎల్బి పేర్కొంది. ఒక నెల వ్యవధి మాత్రమే ఇవ్వడం అసమంజసమని, లా కమిషన్ ఈ ప్రక్రియను విరమించుకోవాలని కోరింది.