
ప్రజాశక్తి - ముదినేపల్లి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలికి శుక్రవారం ప్రముఖ వైద్యులు మనోజ్ ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం ముదినేపల్లి శివారు అన్నవరం గ్రామానికి చెందిన ఈడే నాంచారమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని రూ.3 లక్షల నగదు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు కట్టు వస్త్రాలతో బయటపడ్డారు. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న డాక్టర్ మనోజ్ గౌడ్, సంఘం నాయకులు పరసా ఏడుకొండలుతో కలిసి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. రూ.10 వేలు నగదు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు నాంచారమ్మకు మనోజ్ అందించారు. పంగిడిగూడేనికి చెందిన ఆయుర్వేదం డాక్టర్ పరసా వీర్రాజు రూ.పది వేల నగదును బిసి నాయకులు పరసా ఏడుకొండలు చేతులు మీదుగా బాధితురాలికి అందించారు. ఈ సందర్భంగా ఆయుర్వేదం డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాంచారమ్మకు దాతలు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సాయం అందించాలని కోరారు.