- చేయితడపనిదే ఫైలు కదలదు…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఆదోని తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పనులు జరగవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో కార్యాలయంలో అధికారులు,సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారుల వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలం పరిధిలో మారుమూల గ్రామంలో సుమారుగా 6 ఎకరాల భూమిపై కోర్టులో ఉన్న భూమికి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వడంలో 2లక్షల నుంచి 4లక్షల వరకు దండుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు.మరో అధికారి తాహసిల్దార్ కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే తానే నడిపిస్తున్నట్టు ప్రతి పనికి ఓ రేటు పెట్టి వసూలు చేయడం పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలపై మరో ఇంటి పట్టా సృష్టించడం,ఇద్దరి మధ్య వివాదం పెట్టి దాని పరిష్కరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మరో ఒక్కరికి అన్యాయం చేసి మరొకరికి న్యాయం చేసే విధంగా అధికారి చలామణి అవుతున్నారు. ఈ అధికారి వద్ద ఏ పని కావాలంటే చేయితడపనిదే ఫైలు కదలదు.మరో విఆర్ఓ ఒక పట్టదార పాస్ పుస్తకానికి 5 వేలు రూపాయలు ఫిక్స్ చేసి మరి వసూలు చేయడం గమనార్ధం. పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారిని అధికారులు,సిబ్బంది నెలల తరబడి తిప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే సకాలంలో పనులు జరగక విసుగుచెందిన వారు కార్యాలయంలో ఎంతో కొంత ముట్టజెప్పి తమ పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం.అంతటితో ఆగకుండా అక్రమంగా భూముల పట్టాలను అటు ఇటుగా మార్పిడి చేస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏది ఏమైన అక్రమ సంపాదనే ధ్యేయంగా అధికారులు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది.అక్రమాలకు తోడు భూముల ధరలు ఆకాశానికి తాకడం వారికి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.కార్యాలయానికి వచ్చే మధ్యవర్తుల ద్వారా సైతం అధికారులు రాయబారం నడుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేటతెల్లం అవుతుంది.
మరో అధికారి కార్యాలయంలో ఓ అధికారి గత కొంత కాలం నుంచి ఇక్కడే తిష్టవేసి అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారారని తెలుస్తోంది.సదరు అధికారి ఎక్కడ పనిచేసిన ఇదే వ్యవహారం ఉంటున్నట్లు ప్రజలు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం.కాగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులను ఇక్కడి నుంచి తప్పిస్తేనే కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టవచ్చనే అభిప్రాయం మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి అక్రమాల బాగోతంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
- ట్యాక్సీ ప్లేట్ స్థానంలో వైట్ ప్లేట్ ... తహసీల్దార్ నిర్వాకం
ప్రభుత్వ సొమ్మును అడ్డదారుల్లో సొంత పనులకు వాడుకునేందుకు అధికారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తహసీల్దార్ తన సొంత కారు వైట్ ప్లేట్ నంబర్ వాడుతున్నారు. ప్రభుత్వం తహసీల్దార్లకు ప్రయాణ భత్యం కింద ప్రతినెలా రూ.20వేల నుంచి 30వేలు వరకు చెల్లిస్తోంది. కానీ అందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సొంత వాహనాలను ఉపయోగించరాదని అదే సమయంలో కేవలం ట్యాక్సీ ప్లేట్ (ఎల్లో ప్లేట్) వాహనాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం వాహనం కేటాయిస్తే దానికి సంబంధించిన ఖర్చులను భరిస్తుంది. ఎటువంటి నగదు చెల్లించదు. ప్రభుత్వ వాహనం అందుబాటులో లేకుంటే నిరుద్యోగులు డ్రైవింగ్ వృత్తి చేసుకుని ఉపాధి పొందేందుకు ఇలాంటి నిబంధనలు విధించారు. కాగా నిబంధనలను తుంగలో తొక్కుతూ సొంత వాహనాలు వాడుతూ రెంట్ వాహనాలను వాడుతున్నట్లు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రతినెలా సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నారు.ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా తన సొంత వాహనమే ఉపయోగిస్తున్నట్లు చెప్పడం గమనార్హం










