Mar 21,2022 07:56

యంగ్‌ హీరో శర్వానంద్‌ సాలిడ్‌ హిట్‌ కొట్టి చాలాకాలం అవుతుంది. 'మహానుభావుడు' తర్వాత ఆయనకు మరలా సక్సెస్‌ దక్కలేదు. ఇటీవల ఆయన తీసిన 'శ్రీకారం', 'మహాసముద్రం' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి పక్కా హిట్‌ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు. రష్మిక మందన్నతో కలిసి కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ''ఆడవాళ్లు మీకు జోహార్లు'' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ట్రైలర్‌, పాటలపై పాజిటివ్‌ టాక్‌ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మార్చి 4న విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో తెలుసుకుందాం.

'ఆడవాళ్లు మీకు జోహార్లు'

నటీనటులు

టైటిల్‌ : ఆడవాళ్లు మీకు జోహార్లు
నటీనటులు : శర్వానంద్‌, రష్మిక, ఖుష్భు,
రాధిక, ఊర్వశి, వెన్నెల
కిషోర్‌, సత్య, ప్రదీప్‌ రావత్‌,
రవిశంకర్‌, ఝాన్సీ తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
నిర్మాత : సుధాకర్‌ చెరుకూరి
రచన-దర్శకత్వం : కిషోర్‌ తిరుమల
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : సుజిత్‌ సారంగ్‌
ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌
విడుదల తేదీ : మార్చి 04, 2022

కథలోకి వెళ్తే చిరంజీవి అలియాస్‌ చిరు (శర్వానంద్‌) ఉమ్మడి కుటుంబంలో పుట్టిన ఒక్కగానొక్క అబ్బాయి. అందుకే అతన్ని అందరూ అల్లారుముద్దుగా పెంచుతారు. తల్లితో పాటు ఆమె తోడికోడళ్లూ అతణ్ని కొడుకులాగే చూసుకుంటారు. చిరు మీద అతి ప్రేమతో.. పెళ్ళి చూపులకు వెళ్లిన ప్రతి అమ్మాయిలోనూ లోపాలు వెతికి, అతడికి పెళ్లి కాకుండా అడ్డుపడే పనిలో ఉంటారు. పెళ్లి ఆలస్యానికి ఒకవిధంగా అతడి అమ్మలే కారణమవుతుంటారు. కళ్యాణమండపాన్ని నడిపే చిరుకు వయసు మీద పడుతున్నా పెళ్లికాలేదనే నిరాశలో ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఆద్య (రష్మిక మందన్నా) పరిచయమై.. ఆమెతో ప్రేమలో పడతాడు చిరు. కానీ ఆద్య తల్లికి పెళ్లి పట్ల సరైన అభిప్రాయం ఉండదు. తల్లి అభీష్టానికి వ్యతిరేకంగా చిరును పెళ్లి చేసుకోలేనని చెప్పేస్తుంది ఆద్య. ఈ స్థితిలో చిరు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడన్నది మిగతా కథ.
    ప్రథమార్ధం వరకు ఈ సినిమా బాగానే ఎంగేజ్‌ చేస్తుంది. మరీ ఆశ్చర్యపరిచే.. కొత్తగా అనిపించే సన్నివేశాలు లేకపోయినా.. వినోదానికైతే ఢోకా లేదు. ట్రైలర్లో ఫన్నీగా అనిపించిన హీరో పెళ్ళిచూపుల కాన్సెప్ట్‌ వరకు కిషోర్‌ బాగానే డీల్‌ చేశాడు. 'మల్లీశ్వరి'లో పెళ్ళి కాని ప్రసాద్‌ను గుర్తుకు తెచ్చేలా సాగే హీరో పాత్ర ఆకట్టుకుంటుంది. తన అమ్మలతో కలిసి అతను చేసే హంగామా వినోదాన్ని పంచుతుంది.
    ఇలా ఒక పాజిటివ్‌ ఫీల్‌తో విరామానికి వెళ్లే ప్రేక్షకుడిలో ఆ ఫీల్‌ మొత్తం పోయేలా నడుస్తుంది ద్వితీయార్ధం. తన పెళ్లికి హీరోయిన్‌ కుటుంబంలో సమస్య తలెత్తితే.. హీరో తన ఐడెంటిటీని దాచిపెట్టి ఆ కుటుంబంలోకి వెళ్లి, మంచిపేరు తెచ్చుకునే కథలు ఎన్ని చూశామో లెక్కే లేదు. చాలా ఏళ్ల కిందటే ఈ కథలు అరిగిపోయి పక్కన పెట్టేశారు. సన్నివేశాలు ఎంత మార్చినా ఇది పరమ రొటీన్‌గా అనిపించే వ్యవహారం. కానీ కిషోర్‌ అదే బాటలో నడిచి, సినిమాను ట్రాక్‌ తప్పించేశాడు. హీరో తన మంచితనం చూపిస్తూ.. సమస్యలు పరిష్కరించే వైనం మరీ నాటకీయంగా అనిపిస్తుంది. ఎక్కడా ఎమోషన్‌ అనుకున్నట్లుగా పండలేదు. ఇదే నిరాశ కలిగించే విషయం.. సినిమాకు ఇచ్చిన ముగింపు అయితే మరీ డ్రెమటిగ్గా అనిపిస్తుంది. మనం చూస్తున్నది సినిమానా? సీరియలా? అనిపించేలా విపరీతమైన నాటకీయతతో.. సెంటిమెంట్‌ డైలాగులతో నడిచే పతాక సన్నివేశాలు ఉస్సూరుమనిపిస్తాయి. గుండె బరువెక్కించడానికి ఉద్దేశించిన ఆ సన్నివేశాలు వెటకారపు నవ్వుల్నే మిగులుస్తాయి. మొత్తంగా చెప్పాలంటే.. ప్రథమార్ధంలో వచ్చే కామెడీ సీన్లు.. కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు.. డైలాగ్స్‌ సంతృప్తినిచ్చినా.. ద్వితీయార్థంలో రొటీన్‌బాట పట్టే కథాకథనాలు.. ఓవర్‌ డోస్‌ మెలో డ్రామా.. సీరియల్‌ తరహా ముగింపు.. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'కు ప్రతికూలంగా మారాయి. కుటుంబ ప్రేక్షకులు కాలక్షేపానికైతే ఒకసారి చూడొచ్చు కానీ.. అంతకుమించి ఆశిస్తే కష్టం.

వరుసగా తన సినిమాలు నిరాశ పరుస్తున్నా శర్వానంద్‌ ఏమీ కాన్ఫిడెన్స్‌ కోల్పోలేదు. చాలా ఉత్సాహంగా చిరు పాత్రను చేసుకుపోయాడు. ఈ పాత్ర సరదాగా సాగినంత సేపూ శర్వా ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాల్లో 'రన్‌ రాజా రన్‌' ను గుర్తుచేసేలా నటించాడు. సీరియస్‌ సన్నివేశాల్లో మాత్రం మామూలుగానే కనిపించాడు. రష్మిక మందన్నా నటన ఓకే అనిపించింది. ఖుష్బు కీలక పాత్రలో హుందాగా నటించింది. ఊర్వశి ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంది. ఆ తరహా తింగరితనంతో నవ్వించడం అంత తేలికకాదు. సినిమాలో ఆమె పాత్ర మేజర్‌ రిలీఫ్‌ అని చెప్పాలి. వెన్నెల కిషోర్‌ మూడునాలుగు సన్నివేశాల్లో బాగానే నవ్వులు పంచాడు. రాధిక.. రవిశంకర్‌.. ఝాన్సీ.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.
 

                                                                     సాంకేతిక వర్గం :

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాకు ప్లస్సే. ఓ మై ఆద్య.. ఆసమ్‌.. పాటలు వినసొంపుగా అనిపిస్తాయి. టైటిల్‌ సాంగ్‌ కూడా బాగానే సాగింది. నేపథ్య సంగీతమూ ఓకే. సుజీత్‌ సారంగ్‌ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా కలర్‌ఫుల్‌గా అనిపించేలా విజువల్స్‌తో సపోర్ట్‌ చేశాడు. యువ నిర్మాత సుధాకర్‌ చెరుకూరి నిర్మాణ విలువలు బాగానే పాటించాడు. సినిమా మంచి క్వాలిటీతోనే తెరకెక్కింది. అయితే అన్ని వనరులూ బాగానే సమకూరినా.. దర్శకుడు కిషోర్‌ తిరుమల వీటిని సరిగా ఉపయోగించు కోలేకపోయాడు. బలహీన కథాకథనాలతో నిరాశపరిచాడు. కామెడీ సీన్లను బాగానే డీల్‌ చేసినా.. డైలాగ్స్‌ వరకూ ఆకట్టుకున్నా.. అతడి కథాకథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ అంటే కామెడీ, ఎంటర్‌ టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌, స్క్రీన్‌ప్లే, రచన, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌, ఫస్ట్‌ హాఫ్‌, సుకుమార్‌ వాయిస్‌ ఓవర్‌, రష్మిక స్టయిల్‌, లుక్‌, శర్వానంద్‌ యాక్టింగ్‌. మైనస్‌ పాయింట్స్‌ అంటే మాస్‌ ఆడియెన్స్‌కు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే సెకండ్‌ హాఫ్‌, క్లైమాక్స్‌ గెస్‌ చేసేలా ఉంది.