- క్రీడా విప్లవంలో అందరూ కలిసి రావాలి
- స్పోర్ట్స్ హాస్టలర్స్ ఆత్మీయ సమ్మేళనంలో శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ : పాలనను ప్రజా ఉద్యమంగా నడిపిస్తూ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మలిచిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో క్రీడా విప్లవానికి సైతం బాటలు వేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. 'పల్లెల నుంచి ప్రపంచ చాంపియన్లు రావాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. వ్యవసాయ రంగం తొమ్మిదేండ్లలో పంటల కేంద్రంగా మారినట్టే.. రానున్న కాలంలో క్రీడా రంగం సైతం పతకాల పంట పండిస్తూ చాంపియన్ల కార్ఖానాగా తెలంగాణ వెలుగొందాలి. ఆ దిశగా శాట్స్ ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారుల విజయ గాథలను డాక్యుమెంటరీ, పుస్తకాల రూపంలో యువతకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ శ్రీకారం చుట్టిన క్రీడా విప్లవంలో అందరూ భాగస్వామ్యం కావాలి' అని ఆంజనేయ గౌడ్ తెలిపారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన స్పోర్ట్స్ హాస్టలర్స్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన శాట్స్ చైర్మెన్ ఈ సందర్భంగా మాట్లాడారు.










