- లోక్సభ ముందుకు బిల్లు
-రేపు చర్చ
న్యూఢిల్లీ : చట్ట సభల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయించే రిజర్వేషన్ల బిల్లు ఎట్టకేలకు లోక్సభ ముందుకు వచ్చింది. అయితే, ఈ బిల్లు వల్ల తక్షణమే మహిళా లోకానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదు. బిల్లులో పేర్కొన్న అంశాల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన సకాలంలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తయి, ఎటువంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉంటే 2029 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా దిగువ సభలకే రిజర్వేషన్లను పరిమితం చేశారు. రాష్ట్రాలలో శాసనసభకు, కేంద్రంలో లోక్సభకు మాత్రమే నూతన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత 33 శాతం రిజర్వేషన్లు 15 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటాయి. ఆ తరువాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
శాసనమండలుల, రాజ్యసభకు ఈ బిల్లు వర్తించదు. మరోవైపు ఒబిసిలను విస్మరించారంటూ ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు నూతన భవనంలో మంగళవారం జరిగిన మొట్టమొదటి సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. నారి శక్తి వందన్ అభియాన్ పేరుతో రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ ఈ బిల్లుతో కొత్త చరిత్రను రాస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 19 దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని అన్నారు. బిల్లుపై లోక్సభలో నేడు (బుధవారం) చర్చ, ఓటింగ్ జరగనుంది. లోక్సభ ఆమోదం అనంతరం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మహిళాబిల్లు 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే, తాజాగా క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లు 2010 నాటిది కాదని, కేంద్రం కొత్తగా రాజ్యాంగానికి సవరణ ప్రతిపాదించిందని, అందువల్ల రాజ్యసభ ఆమోదం కూడా తప్పనిసరి అని అధికారవర్గాలు తెలిపాయి. వాస్తవానికి 1996లో హెచ్డి దేవగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును తొలుత లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు.
- బిల్లులో ఏముంది....?
తాజా బిల్లు ప్రకారం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడవ వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. ఆరు పేజీల ఈ ప్రతిపాదిత బిల్లులో లోక్సభ, శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లను రిజర్వు చేయాలని, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వీటిని భర్తీ చేయాలని పేర్కొన్నారు. రాజ్యసభకు, రాష్ట్రాల శాసనమండలికి ఈ కోటా వర్తించదని స్పష్టం చేశారు. ఈ కోటాలోనే ఎస్సి, ఎస్టీలకు మూడవ వంతు సీట్లను కేటాయించనున్నట్లు ప్రతిపాదించారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత రోటేషన్ ప్రకియలో రిజర్వుడ్ సీట్లను నిర్ణయిస్తారు. నియోజకవర్గాల పునర్విభజనకు జన గణన తప్పనిసరి. అయితే 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇది 2027లో జరుగుతుందని భావిస్తున్నారు. ఆ తరువాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన ఏడాదిలో పునర్విభజన ప్రక్రియ పూర్తయే అవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం. దీనిని పరిగణలోకి తీసుకుని 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. 2002లో ఆర్టికల్ 82కు చేసిన సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే మొదటి జనగణన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాల్సిఉంది. ఈ ప్రక్రియను మరింత త్వరగా పూర్తిచేయాలంటే ఆర్టికల్ 82ను మరొసారి సవరించాల్సిఉంటుంది. అయితే, పునర్విభజన ప్రక్రియను త్వరగా చేపట్టడాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలో రూపొందించిన మహిళా బిల్లులో ఆంగ్లో ఇండియన్లకు కూడా కొన్ని సీట్లను కేటాయించగా, తాజా బిల్లులో వాటిని తొలగించారు.
- ఏకగ్రీవంగా ఆమోదం తెలపండి : ప్రధాని
బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. 'ఎంతో ముఖ్యమైన బిల్లును తీసుకువస్తున్నాం. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరగడమే లక్ష్యం. ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.' అని ఆయన అన్నారు.
- మరో జుమ్లా కాకూడదు : ఏచూరి
మహిళా రిజర్వేషన్ల బిల్లు 2024 ఎన్నికలకు ముందు ఓటర్లను మభ్యపెట్టడానికి ఉద్దేశించిన మరో మోడీ జుమ్లా కాకూడదన్న ఆకాంక్షను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యక్తం చేశారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో ' ఇది ఎప్పుడు ఆమోదం పొందినా తదుపరి జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తరువాతే 2029నాటికి అమలులోకి వస్తాయి' అని పేర్కొన్నారు. ' ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చింది. 2014 ఎన్నికల ప్రచార సమయంలో తాను ప్రధాని అయితే మొట్టమొదటి ఈ బిల్లునే తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాల సమయం గడిచింది. ఈ బిల్లుకోసం 25 సంవత్సరాల సుదీర్ఘ సమయం వేచి చూశాం' అని పేర్కొన్న ఆయన 2010లో రాజ్యసభ సభ్యునిగా బిల్లు ఆమోదం కోసం ఓటు వేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.










