Oct 22,2023 14:41

హైదరాబాద్‌ : కేసీఆర్‌ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చెప్పారని, బస్సులు పెట్టి రైతలు, నేతలను తీసుకెళ్లి కాళేశ్వరం చూపించారని అన్నారు. పంపు హౌసులు మునిగినప్పుడు కాంగ్రెస్‌ నేతలను చూడనివ్వలేదని, ఇప్పుడు ఎలాంటి వరదలు లేకుండానే ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని రేవంత్‌ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌ గాంధీ ఎన్నోసార్లు చెప్పారని, కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతూనే ఉన్నామని, ఇప్పటికైనా దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమండ్‌ చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వథా చేశారని, ప్రాజెక్టుపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ దర్యాప్తు జరిపించాలన్నారు. సిట్టింగ్‌ జడ్జితో ప్రాజెక్టు పనులపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.