
ప్రస్తుతం మనం నైతిక విలువలు కనపడకుండా పోతున్న సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో మానవత్వంతో వ్యవహరించడం ఆడ, మగ అందరికీ అసాధ్యం అయిపోతోంది. ప్రభుత్వం సంగతి చూస్తే అది నిష్పక్షపాత వైఖరితో, న్యాయబద్ధంగా, ధర్మంగా వ్యవహరించడం అనేది ఎప్పుడో మరిచిపోయింది. ఇక నాయకులు ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమౌతున్నారు. నిజానికి వాళ్ళు తమ వాగ్దానాలను అమలు చేస్తారని ఎవరూ ఆశించడం లేదుకూడా. ఏ మాత్రం జంకు, గొంకు లేకుండా, మనస్సాక్షి అనేదే లేకుండా 'మాదే మెజారిటీ గనుక మా మాటే శాసనం' అనే విధానాన్ని ప్రభుత్వం ఆచరిస్తోంది. ప్రాచీన నిర్మాణాలను అమూల్యమైన చారిత్రక సంపదగా పరిగణించి పరిరక్షించాల్సినది పోయి వాటిని ఉంచాలా, కూల్చాలా అన్నది వాటిని నిర్మించిన వారి మతాన్ని బట్టి నిర్ణయిస్తున్నారు. ఆఫీసులలో పని చేసేవారి పట్ల, ఇళ్ళల్లో నివసించేవారి పట్ల ఎలాంటి వైఖరి ఉండాలన్నది కూడా అదే మాదిరిగా నిర్ధారిస్తున్నారు. ప్రభుత్వాన్ని గాని, ప్రభుత్వపు దన్నుతో రెచ్చిపోతూ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రదర్శనల్ని నిర్వహిస్తున్న అసాంఘిక శక్తుల్ని గాని నువ్వు ప్రశ్నిస్తే ఇక అంతే. నువ్వే వాళ్ళకి ప్రధాన లక్ష్యం అయిపోతావు. మారు మాట్లాడకుండా తల ఒగ్గడమే నేడు అనుసరించాల్సిన పద్ధతి. మానవత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటివి ఇప్పుడు డీప్ ఫ్రీజ్లో ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని బైటకు తెచ్చి నడిపించేదెన్నడో తెలీదు.
మారిపోతున్న విలువలు
యోగితా భయానా ఒక సామాజిక సేవకురాలు. గురుగ్రాంలో కొందరు గూండాలు ఒక ముస్లిం వ్యక్తికి చెందిన దుకాణాన్ని తగులబెడితే, దానిని తిరిగి నిర్మించుకోడానికి సహాయం చేసిందామె. ఆ సమాచారాన్ని, ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఆ దుకాణదారుడి వీడియో క్లిప్పింగ్ని సోషల్ మీడియాలో పెట్టారు. వెంటనే యోగితకు మొదలయ్యాయి ట్రోలింగ్ వేధింపులు. నష్టపోయినవాళ్ళు మరో 50, 60 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పోయి సాయం చెయ్యమంటూ వెటకారంగా కొందరు కామెంట్స్ పెట్టారు. ఆమె ఇంటి చుట్టుపక్కల హిందూ మహిళలు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళకి లేని బాధ నీకెందుకు? అంటూ మరి కొంతమంది కామెంట్ చేశారు. బహుశా ఒక పది, పదిహేనేళ్ళ క్రితం ఇటువంటి సహాయాన్నే చేసి వుంటే, ఆ కాలంలో యోగితకు అభినందనల పరంపర ఎదురై వుండేది. మత సామరస్యాన్ని నిలబెట్టినందుకు గౌరవం దక్కేది. కాని, ఇప్పుడా పరిస్థితి లేదు. మారిపోయింది.
పాతకాలపు విలువలు ఇప్పుడు లేవు. మత విశ్వాసాలు వేరు వేరుగా ఉన్నా, అందరమూ కలిసి బతుకుదాం అన్న ఐక్యతా స్ఫూర్తిలో విశ్వాసం లేనివాళ్ళు ఇప్పుడు కోట్లలో తయారయ్యారు. ఇప్పుడు ఎవరికి వారే. పక్కవాడు ఎలా పోయినా పట్టించుకోనవసరం లేదు అన్న ధోరణి బాగా పెరిగింది. హర్యానా లోని నువాలో అనిస్ అనే వ్యక్తి ముగ్గురు హిందూ యువకులకు తన ఇంట రక్షణ కల్పించి వాళ్ళని వెంట తరుముతున్న మూకల నుండి కాపాడాడు. తమ ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ ముగ్గురూ అతని పట్ల కృతజ్ఞత తెలిపారు. కాని, ఆ మర్నాడు అనిస్ ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేసేశారు. హర్యానాలో బుల్డోజర్లతో విధ్వంసం చేయడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఆ విషయం మీద పంజాబ్-హర్యానా హైకోర్టు జోక్యం కల్పించుకుని ఈ విధంగా చెప్పింది: ''ముందస్తుగా నోటీసులు ఏవీ జారీ చెయ్యకుండా, కూల్చివేతకు అనుమతించే ఉత్తర్వులు ఏవీ లేకుండా శాంతి, భద్రతల రక్షణ పేరుతో ఇలా భవనాలను కూల్చివేయడం తప్పు. శాంతి భద్రతల సమస్య ఒక సాకుగా ఉపయోగించుకుని ఒకే మతానికి చెందిన వారి ఇళ్ళను కూల్చివేయడం జరుగుతోందా అన్న అంశాన్ని కూడా చూడాలి. కొన్ని జాతుల సమూహాలను నిర్మూలించే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందా అన్నది కూడా పరిశీలించాలి.''
సమాజంలో నైతిక విలువల పతనం ఇదివరకే మొదలైంది. కాని మరీ ఇంత అథమ స్థితికి చేరుకోవడం గతంలో లేదు. అతి నీచంగా, పబ్లిక్గా ఆడబిడ్డల్ని మణిపూర్ వీధుల్లో అవమానపరచిన వైనం ఆ అథమ స్థితికి సూచన కాక ఇంకేమిటి? ఆ ఉదంతంపై అధికారంలో ఉన్న వారి స్పందన సంగతేమిటి? అది దేన్ని సూచిస్తోంది? ఆ బాధితులను ఆ పాశవిక మూకలకు అప్పజెప్పినది ఆడవాళ్ళేనంటూ ఆ దుర్మార్గాన్ని సమర్ధించే నైచ్యం దేనికి సంకేతం? కథువాలో జరిగిన మరో ఉదంతం చూడండి! అక్కడ ఒక ఎనిమిదేళ్ళ ముక్కుపచ్చలారని పసిబాలికను ఘోరంగా రేప్ చేశారు. ఆ ఉదంతంలో నిందితులకు మద్దతుగా కొందరు జనాలు ఊరేగింపు తీశారు !
వెయ్యేళ్ళ క్రితమో, లేకుంటే నాలుగు వందల ఏళ్ళ క్రితమో ఎవరో ఒక రాజు, లేదా దండెత్తి వచ్చినవాడు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించాడంటూ ఇప్పుడు దానికి బాధ్యులుగా కొందరిని చేసి వారిపై దాడులకు దిగుతున్నారు. ఆ దాడులను మనలో కొందరు సమర్ధిస్తున్నారు. కాని ఇప్పుడే, మనముందే మణిపూర్లో, హర్యానా లో జరుగుతున్న అన్యాయాలకు బలైపోయిన బాధితులకు న్యాయం చేయాలని అడగడానికి మనం నోళ్ళు మెదపడం లేదు. ఫెవికాల్తో మన పెదవులు అతుక్కుపోయాయి. ఎప్పుడో, ఎవరో దండెత్తి వచ్చినవాళ్ళు మన ప్రార్థనాస్థలాలను ఏ విధంగా అపవిత్రం చేశారో (ఆ ఘటనల్లో కొన్ని జరిగినవి, మరికొన్ని కేవలం కల్పితమైనవి కూడా ఉన్నాయి) చర్చించి, అప్పటి చారిత్రిక తప్పిదాలను ఇప్పుడు సరి చేయడానికి తయారయ్యాం. అది కూడా ఏ విధంగా? కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆ రాజు ఏ మతానికి చెందినవాడో ఆ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలమీద ఇప్పుడు దాడులు చేయడం ద్వారా. అప్పుడు ఆ రాజు చేసినది తప్పు అయితే ఇప్పుడు మరి మనం చేస్తున్నదేమిటి? అదే తప్పు కాదా? ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, హర్యానాలో పదే పదే మసీదులమీద దాడులు జరుగుతూనే వున్నాయి. ''మసీదు అంటే ఏమిటి? మహా అయితే అదో కట్టడం. చాలా కట్టడాలను కూల్చివేసినట్టే వాటినీ కూల్చేస్తాం'' అని బాబరి మస్జిద్ విధ్వంసం సందర్భంలో ఎల్.కె.అద్వానీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జ్ఞానవాపి మసీదు వియంలో కూడా అదే వ్యాఖ్యానం చేశాడు. జరిగినదానికి ఏ విధమైన విచారం గాని సిగ్గు గాని లేనే లేదు. ఇది చరిత్రను రీవైండ్ చేస్తున్నట్టు ఉంది.
నైతిక దౌర్బల్యం తాండవిస్తున్న కాలం ఇది. ప్రతీ జాతీ అప్పుడప్పుడు మనో వైకల్యానికి లోనవుతూ వుంటుంది. మన విషయంలో ఆ వైకల్యం షార్ట్ టర్మ్ అమ్నీషియా (స్వల్పకాలిక మతిమరుపు) రూపంలో వ్యక్తం ఔతున్నట్టుంది. జరుగుతున్న వాటిని మనం చూస్తూనే వున్నాం. కాని వెంటనే మరిచి పోతున్నాం. గోగూండాలు ఒక మనిషిని చితక్కొట్టి చంపేసినా, ఒక మహిళ సామూహిక అమానుషత్వానికి బలైపోయినా ఆ సంఘటనలు మన మనస్సుల్లోని జల్లెడ కన్నాలనుండి జారిపోతున్నాయి. చాలా కొద్ది విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. రోజూ కళ్ళెదుట జరుగుతున్న నీచమైన సంఘటనలను చూసి చూసి అలసిపోయామా? బహుశా అంతే అయివుండాలి మరి. కాకపోతే మన రోజువారీ పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోలేకపోతున్నామా? అది కూడా అయివుండొచ్చు. కారణం ఏదైనా, మన నుండి ప్రతిస్పందన లేకపోవడం వలన విద్వేష మూకలకి, అసహనపరులకి ధైర్యం పెరుగుతుంది. జరుగుతున్న దాడి అక్కడో మసీదు మీదనో, ఇక్కడో దుకాణం మీదనో అయితే, అంతవరకూ అయితే వాటిని అదుపు చేయవచ్చు. కాని ఇప్పుడు జరుగుతున్న దాడి అటువంటి చెదురు మదురు దాడి కాదు. ఇక్కడే అసలు సమస్య ఉంది.
జోక్యం కల్పించుకోకపోవడం
ఇప్పుడు త్రిశూలాలు, పలుగులు, గొడ్డళ్ళు పుచ్చుకుని దాడి చేసే మూకలు అవసరం లేదు. ఇప్పుడు బుల్డోజర్లు ఆ పని కానిచ్చేస్తున్నాయి. ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నవాడిపైన లేదా ఒక చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నవాడిపైన దాడి చేసి వాటిని కూల్చివేసినప్పుడు గతంలో అక్కడినుంచి మూకలు చెల్లాచెదురు అయిపోయేవి. కాని ఇప్పుడు ఆ విధ్వంసం ముందు దర్జాగా నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు. వాటిని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఒక గోగూండా ఒక బక్కచిక్కిన పేద మీద విరుచుకుపడి, అతడిని వేధిస్తున్న వైనాన్ని, ప్రయోగిస్తున్న తిట్లను రికార్డు చేయిస్తున్నాడు. రైలులో ఒక పోలీసు జవాను తన పై అధికారిని, మరో ముగ్గురు ముస్లిం ప్రయాణికులను కాల్చి చంపి, ఆ తూటాలకు బలై కొనవూపిరితో వాళ్ళు అతగాడి బూట్లకింద కొట్టుమిట్టాడుతూ వున్నప్పుడే అక్కడే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి జేజేలు పలికాడు. జనాలు కూడా జరుగుతున్న దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయడం కన్నా దానిని వీడియోగా తీయడమే ప్రధానం అనుకుంటున్నారు. ఇక బుల్డోజర్ బాధితులు తమపై జరిగే దుర్మార్గాన్ని తామే కళ్ళారా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోతున్నారు. కళ్ళ ముందే తాము కట్టుకున్న ఇల్లు ఒక్కో ఇటుకా, ఒక్కో రాయీ రాలి పడుతూంటే బిక్కచచ్చి కూలబడుతున్నారు. మరోపక్క మీడియాలో కూడా కొందరు ఆ విధ్వంసాన్ని చూపిస్తూ క్షణాల్లో 'న్యాయం' ఏ విధంగా జరిగిందో చెప్తూ కీర్తిస్తున్నారు.
బుల్డోజర్ల విధ్వంసంలోని క్రూరత్వాన్ని, మూక దాడుల హత్యల్లోని ఆటవికతను, దేశ ప్రజల్లో ఒక పెద్ద భాగం పశుప్రాయులుగా దిగజారి ప్రవర్తించడాన్ని మనం అందరం చూస్తున్నాం. ఏమీ పట్టనట్టు, లేదా ఇది రోజూ జరుగుతున్నదేలే అన్నట్లు చూస్తున్నాం. సామాజిక స్పృహ లేకుండా బతికేయడం నేటి ప్రజానీకానికి అలవాటైపోయింది మరి!
జియా ఉస్ సలామ్
( స్వేచ్ఛానుసరణ )