
తిరుమల : టీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని వినాయకనగర్ టీటీడీ క్వార్ట్రర్స్ లో ఉద్యోగుల కోసం రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ను గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో యాత్రికులకు ఇబ్బంది కలిగించేలా సులభ్ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగడం సరైందని కాదన్నారు. ముందస్తు నోటీసు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు, ఉద్యోగులు యాత్రికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ చెప్పారు.ఉద్యోగుల 20 సంవత్సరాల కల అయిన ఇంటిస్థలాలను సాకారం చేశామన్నారు.ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు మరింతగా యాత్రికుల సేవ చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎస్టేట్ ఓఎస్డీ మల్లిఖార్జున, డిప్యూటీ ఈవో స్నేహలత పాల్గొన్నారు.