Jul 18,2023 16:48

ప్రజాశక్తి-కౌతాళం(కర్నూలు) : మండల పరిధిలోని ఎరిగేరి గ్రామంలో పట్టాలున్న ప్రజలందరికీ స్థలాలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్‌ తిక్క రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎరిగిరి గ్రామంలో పట్టాలు ఇచ్చిన స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. గత ప్రభుత్వం 2006 సంవత్సరంలో సర్వే నెం.253లో 9 ఎకరాలు 69 సెంట్లు ప్రభుత్వ భూమిని దాదాపు 300 మంది స్థలాలు లేని పేదప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏరిగేరి గ్రామంలో ఆదోనికి పోవు మెయిన్‌ రోడ్డులో వున్న అత్యంత విలువగల ఈ భూమిని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు వైసీపీ ముఖ్యనాయకులు అక్రమంగా కబ్జా చేశారన్నారు. ప్రైవేట్‌ లేఔట్లు వేసి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తూ రియల్‌ దందకు తెరలేపారవి ఆరోపించారు. మూడుసార్లు ఓట్లు వేసి గెలిపించిన ఏరిగేరి గ్రామ ప్రజలకు బాలనాగిరెడ్డి ఇస్తున్న బహుమతి ఇదేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ప్రభుత్వ, ప్రజల స్థలాలను ఆస్తులను అమ్ముకోండి మేము కళ్ళుకు గంతులు కట్టుకుని చూస్తూ ఉంటామని ప్రభుత్వ అధికారులు తీరు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు అందరూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అండగా ఉంటున్నరాని విమర్శించారు. ఎరిగేరి గ్రామంలో 2006లో పట్టాలు వచ్చిన ప్రజలందరికీ అండగా ఉంటామని ఈ స్థలాలు ప్రజలకు ఇచ్చేంతవరకు టిడిపి పోరాటం చేస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే స్థలాలు లేని పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చన్నబసప్ప తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్‌ నాయుడు, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి వెంకటపతి రాజు , మైనారిటీ సెల్‌ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్‌, టిడిపి నాయకులు కురుగోడు రహిమాన్‌, రాజనంద్‌, రాజబాబు, దమ్ములుదిన్నే రమేష్‌ గౌడు, బాపురం వెంకటరెడ్డి, ఎరిగేరి రామలింగ, బసవరాజు, శ్రీరాములు,అంజి,నాగరాజు, సీతయ్య,శీను,డేవిడ్‌, ఈరన్న, స్వామి దాసు, రమేష్‌, పాల్గొన్నారు.