చంద్రగిరి (తిరుపతి) : టిడిపి అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి తలపెట్టిన 'నిజం గెలవాలి' యాత్ర బుధవారం ప్రారంభమైంది. ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఉన్న టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రగిరికి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఆవేదనతో మృతి చెందినవారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. వారానికి మూడు రోజులపాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొననున్నారు. మొదటిరోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎ.ప్రవీణ్రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని.. వారి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. కాసేపట్లో నేండ్రగుంట చేరుకుని అక్కడ మృతి చెందిన టిడిపి కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరితోపాటు టిడిపి నేతలు, ఇంఛార్జిలు ఉన్నారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.










