విశాఖ : మోడీ విధానాలతోనే రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని సిఐటియు ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత ఆరోపించారు. బుధవారం ఉదయం విశాఖలో హేమలత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నారు. రైల్వే భద్రత పట్టించుకోకుండా ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నవంబర్ 3 న రైల్వే స్టేషన్ దగ్గర నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. రైల్వేను ప్రైవేటీకరించడం అంటే కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. బాలాసోర్ ప్రమాదంలో 300 కి పైగా చనిపోయారని చెప్పారు. మానవ తప్పిదమని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని కానీ ప్రైవేటీకరణ విధానాలే అసలు కారణం అని ధ్వజమెత్తారు. రైల్వేల్లో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ట్రాక్ నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. సామాన్యలకు అందుబాటులో ఉండాల్సిన వ్యవస్ధ రైల్వే అని అన్నారు. ఇది కేవలం ప్రమాదం జరిగిన కోణానికే పరిమితం కాకుండా మొత్తంగా విధానాల్లో భాగంగా చూడాలని హేమలత వివరించారు.










