గుంటూరు: ఏపీ అధికార పక్షం వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని, తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారాయన.''మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. గత 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం. చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టం కట్టిన ప్రభుత్వంకూడా మనదే. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాబోయే రోజుల్లోకూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈరోజు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ''సామాజిక సాధికార యాత్ర'' ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి. పేదవాడి విజయానికి బాటలు వేయాలి '' అని సీఎం జగన్ తన ట్వీట్లో ప్రస్తావించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రకు సిద్ధమైంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం అయ్యింది. నేటి నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరగనుంది.
ఆదివారాలు మినహా రోజూ రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గంటారు. జగనన్న పాలనలో జరిగిన అభివఅద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఎమ్మెల్యేలు, స్థానిక సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు.










