న్యూఢిల్లీ : గతేడాది సెప్టెంబర్ 2న ఢిల్లీలోని బదర్పూర్ పోలీస్ స్టేషన్లో పోలీసు లాకప్లో అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు రూ.50 వేలు నష్టపరిహారాన్ని అందించింది. పోలీసు అధికారులు తమకు తాముగా చట్టం కాకూడదనే అర్థవంతమైన సందేశాన్ని అధికారులకు పంపాలని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ నష్టపరిహారాన్ని తప్పు చేసిన ఇద్దరు పోలీసు సిబ్బంది జీతాల నుంచి వసూలు చేయాలని జస్టిస్ ప్రసాద్ ఆదేశించారు. పంకజ్ కుమార్ శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రసాద్ తీర్పు చెప్పారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి అరగంట పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు. గతేడాది 2న బదర్పూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి అధికారిక అరెస్టు, ఎఫ్ఐఆర్ లేదా రోజువారీ డైరీ నమోదు లేకుండా పిటిషనర్ను లాకప్ లోపల ఉంచారని జస్టిస్ ప్రసాద్ గుర్తించారు. పోలీసుల ప్రవర్తనను జస్టిస్ ప్రసాద్ తప్పుబట్టారు. ఆర్టికల్ 21ను పోలీసులు ఉల్లంఘించారని కనుగొన్నారు. పౌరుని రాజ్యాంగ, ప్రాథమిక హక్కులను గాలికి వదిలేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ప్రవర్తించిన తీరు భయానకమని ఆయన అన్నారు. చట్టానికి అతీతంగా ప్రవర్తించే పోలీసు అధికారులు పౌరుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల జస్టిస్ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు.










