
వ్యవస్థలోని లోపాలు.. కులవివక్ష, లింగ వివక్ష, అంతరానితనం, అంతరాలపై ఇప్పటి వరకూ అనేక చిత్రాలు వచ్చాయి. ఇటీవల కీర్తి సురేష్ నటించిన 'చిన్ని' చిత్రం దగ్గర నుంచి ఆ మధ్య సూర్య నటించిన 'జై భీమ్' వరకూ ఎన్ని చిత్రాలు వచ్చినా అన్నింటిలోనూ కామన్ అంశం వివక్ష. అయితే 'నెంజుక్కు నీది' చిత్రం హిందీలో వచ్చిన 'ఆర్టికల్ 15'కు అనువాదమే.. హిందీలో అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో సినీ కవి అరుణ్ రాజా కామరాజ్ తీశాడు. తమిళానికి తగినట్టుగా మార్పులు చేసుకున్నారు. కథనం ఆసక్తికరంగా మలిచాడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..!

కథలోకి వెళ్తే.. 'నెంజుక్కు నీది' (తెలుగు డబ్బింగ్ ఉంది)లో పెద్ద కులం వాళ్ల కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో కొందరు పనిచేస్తుంటారు. అందులోని ముగ్గురు ఆడపిల్లలు తమ రోజు కూలీ ముప్పై రూపాయలు పెంచమంటారు. ఆ ఫ్యాక్టరీ బాగా బలిసిన వ్యక్తిది. పైగా మంత్రి మేనల్లుడిది. అతనికి 30 రూపాయలు పెంచమని అడగడం ఇష్టం ఉండదు. తన కింద పనిచేసే కార్మికులు ఏదైనా డిమాండ్ పెట్టడం అసలు నచ్చదు. అందులోనూ వీరు దళితులు కావడంతో, వాళ్లు వచ్చి తమని అలా అడగడం జీర్ణించుకోలేడు. కొబ్బరిపీచు ఫ్యాక్టరీతోపాటు అతనికి స్కూల్ కూడా ఉంటుంది. ఓ రోజు ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళ్లే క్రమంలో, యజమాని స్కూల్ బస్సులో ఆ ముగ్గురినీ కిడ్నాప్ చేయిస్తాడు. ఆ తర్వాత స్కూల్కి తీసుకెళ్లి, అత్యాచారం చేస్తాడు. అనంతరం ఇద్దర్ని చంపేసి, చెట్టుకు ఉరి తీస్తారు. మరో అమ్మాయి తప్పించుకుంటుంది. ఈ క్రమంలో కేసును ఛేదించే బాధ్యతను పొల్లాచ్చి ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విజయరాఘవన్ (ఉదయనిధి) కి అప్పగిస్తారు. పట్టణంలో ఇద్దరు దళిత బాలికల అనుమానాస్పద మృతి, మృతదేహాలు చెట్లకు వేలాడటం, పోస్టుమార్టం రిపోర్టు అందుబాటులో ఉంచకుండా పాలకవర్గాలు రాజకీయాలు చేయడంతో విజయరాఘవన్లోని అనుమానాలు బలపడతాయి. ఈ దేశంలో 'నేరము-శిక్ష' నేరుగా ఉండదు అని విచారణ చేసే కొద్దీ అర్థం చేసుకుంటాడు విజయరాఘవన్. బాధితులకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయం చేసేందుకు విజయరాఘవన్ ఏం చేశాడు? మిస్టరీ డెత్ను ఎలా ఛేదిస్తాడు? తప్పిపోయిన అమ్మాయి ఏమైంది? వంటి విషయాలే మిగతా కథ..

దేశంలో జరిగే ఎన్నో అత్యాచారాలు, హత్యలు, హత్యాచారాల్లో నిందితులైన కొందరికి వెంటనే శిక్షలు పడటం, కొన్ని కేసులు ఎప్పటికీ తేలకపోవడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇందులో 'ఎవరు' నేరం చేశారు? 'ఎవరు' బాధితులు? ఏ (కులం) పార్టీ అధికారంలో ఉంది? ఏ (కులం) అధికారి విచారణ చేస్తున్నాడు? ఏ 'కులం' వాళ్లు దీనికి ఎలా రియాక్ట్ అవుతారు? డిఫెన్స్ లాయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ వర్గాల వారు 'శిక్ష'ను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని దర్శకుడు ఈ చిత్రంలో చూపించాడు. ఈ చిత్రంలోనూ చనిపోయింది దళిత అమ్మాయిలు కాబట్టి.. చట్టంలో ఉండే కొందరు అధికారులు 'ఇది మామూలే' అనుకుంటారు. కేసు క్లోజ్ చేయాలని చూస్తారు. కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్న విజయరాఘవన్పై ఒత్తిడి తెస్తారు. చివరకు సస్పెండ్ చేస్తారు. కానీ విజయరాఘవన్ తగ్గడు. రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 15'ని గుర్తు చేస్తాడు. 'జన్మ వల్లగాని, పుట్టిన ప్రాంతం వల్ల గాని, కులం వల్ల గాని, మతం వల్ల గాని వివక్ష చూపరాదు' అని చెప్పేదే ఆర్టికల్ 15. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన అధికారిగా ముందుకు సాగి, కేసును ఛేదిస్తాడు.
'ప్రతి కులంలో బాధ ఉంది' అని ఒక మంచి అధికారి ఇందులో దళితుడితో అంటాడు. అందుకు జవాబుగా ఆ దళితుడు 'నిజమే. ప్రతి కులంలో బాధ ఉంది. కానీ కులం వల్ల మాత్రమే కలిగే బాధ మాకు మాత్రమే ఉంది' అని జవాబు చెప్తాడు. ఇక ఆ కులంలో పుట్టే స్త్రీల బాధ ఎలాంటిదో ఈ సినిమాలో చూపించారు. 'విద్యలో, ఉద్యోగాల్లో చూపే అంటరానితనం అత్యాచార సమయంలో మాత్రం ఉండదు' అనే డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. చివరగా 'వ్యవస్థ మారలేదని కాదు. చాలా మారింది. కానీ అది సరిపోదని, సరి చేసుకోవాల్సిందే' నని చెప్పే సినిమా 'నెంజుక్కు నీది'.
ఉదయనిధికి ఇది 12వ సినిమా. తన 10 ఏళ్ల కెరీర్లో సామాజిక న్యాయం గురించి చెప్పే పర్ఫెక్ట్ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనదైన ముద్ర వేస్తూ కథను నడిపించాడు. ఇక తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కాకుండా హీరోకి మార్గనిర్దేశం చేసే కీలకపాత్రలో అద్భుతంగా నటించారు.
ఇద్దరు అమ్మాయిలు సురేష్ చక్రవర్తి, ప్రిన్స్ తమ పాత్రల్లో జీవించారు. ఆరి అర్జునన్ యోధుడి పాత్రలో, రచ్చసన్ శరవణన్, శివాని రాజశేఖర్, రమేష్ తిలక్, మైలస్వామి పాత్రల పరిధిమేర నటించారు.
దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణంలో రెండు విభిన్న కోణాలను ప్రతిబింబించారు. దిబు సైనాన్ థామస్ సంగీతం, బీజీఎం సినిమాకు అదనపు ఆకర్షణ. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు ఆరుణ్రాజ్ ఆర్టికల్ 15 ఆత్మను దెబ్బతీయకుండా తనదైన స్టైల్లో కథను ఓమలిచిన తీరు అద్భుతం.